Parliament : అదానీ గ్రూప్ వ్యవహారంపై రెండోరోజు పార్లమెంట్ రడగ కొనసాగింది. విపక్షాల ఆందోళనతో ఉభయ సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్బర్గ్
సంస్థ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని కోరాయి. అదానీ వ్యవహారంపై చర్చకు లోక్సభ స్పీకర్ నిరాకరించారు. సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్నారు. మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ కూడా విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. దీంతో ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ లో ఆందోళన చేపట్టారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభ, లోక్సభలో కార్యకలాపాలకు ఆటంకం కలిగింది.
రెండోరోజు పార్లమెంట్ సమావేశాలకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష పార్టీలన్నీ సమావేశం అయ్యాయి. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ కార్యకలాపాల అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాయి. చర్చకు పట్టుబట్టి ఆందోళనకు దిగాయి. ఇదే అంశంపై పార్లమెంట్ రగడ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అదానీ గ్రూప్ వ్యవహారాల అంశంపై చర్చ జరిగే వరకు విపక్షాలు ఆందోళనలు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మరి అధికార పక్షం ఈ అంశాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.