Phone Hacking : దేశంలో ఫోన్లు హ్యాకింగ్ అలజడి రేగింది. దేశవ్యాప్తంగా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయా? యాపిల్ కంపెనీ తమ వినియోగదారులకు పంపిన ఇ-మెయిల్స్ తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కేంద్రం హ్యాక్ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఐఫోన్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నించడంతో కుట్ర బయటపడిందన్నారు.
కేంద్రం.. ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఇప్పటికే కొందరు ఎంపీలు ఆరోపించారు. యాపిల్ సంస్థ నుంచి తమకు అలర్ట్ మెసేజ్లు వచ్చాయని వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఈ ఆరోపణలు చేశారు. యాపిల్ నుంచి వచ్చిన అల్టర్ మెసేజ్ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు ఐఫోన్ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ మెసేజ్ ల్లో ఉంది. ఫోన్లోని కీలక సమాచారం, కమ్యూనికేషన్స్, కెమెరా, మైక్రోఫోన్లను యాక్సెస్ చేసే అవకాశం ఉందని ఆ సందేశాల్లో ఉంది.
ఇండియా కూటమి ఎంపీల ఫోన్లను హ్యాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. తనతో సహా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, శశి థరూర్, ప్రియాంక చతుర్వేది, సీతారాం ఏచూరి, పవన్ ఖేరా, రాహుల్ గాంధీ కార్యాలయానికి యాపిల్ సంస్థ నుంచి వార్నింగ్ మెసేజ్లు వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉన్నాయని టీఎంసీ ఎంపీ ట్వీట్ చేశారు.
శశి థరూర్ కూడా హ్యాకింగ్ మెసేజ్లపై స్పందించారు. తనకు యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్లు వచ్చాయని తెలిపారు. తనలాంటి వారు చెల్లించే పన్నులతో ఉద్యోగులను బిజీగా ఉంచడం ఎంతో ఆనందంగా ఉందని శశి థరూర్ సెటైరికల్ గా ట్వీట్ చేశారు.
ఫోన్ల హ్యాకింగ్ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ విషయంలో యాపిల్ నుంచి స్పష్టత కోసం ఎందుకు వేచి చూడలేకపోతున్నారు? అని బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా నిలదీశారు. విపక్ష ఎంపీలకు వచ్చిన అలర్ట్ మెసేజ్లు యాపిల్లోని అల్గారిథమ్ పనితీరులో లోపం కారణంగా వచ్చాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్రం నుంచి అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని వెల్లడించారు.