Durga Pooja Violence| దసరా పండుగ సందర్భంగా దుర్గామాత ఊరేగింపులో హింస చెలరేగింది. ఈ హింసలో తుపాకీ కాల్పులు జరిగి ఒక వ్యక్తి మరణించగా.. నిందితులు వాహనాలు, షాపులకు నిప్పంటించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలలోని భైరాచ్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. భైరాచ్ జిల్లాలోని మహసీ మండలంలో ఆదివారం దసరా పండుగ ముగింపు వేడుకల్లో భాగంగా కొందరు దుర్గామాత ఊరేగింపు చేశారు. అయితే ఊరేగింపులో జోరుగా డీజె సంగీతం పెట్టారు. అలా ఊరేగింపు తీసుకెళ్లే మార్గంలో ముస్లిం జనాభా ఉన్న ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతానికి చేరుకోగానే ముస్లిం వర్గానికి చెందిన కొందరు ఊరేగింపు డీజె మ్యూజిక్ తగ్గించాలని చెప్పారు.
అలా చేయడం కుదరదని ఊరేగింపు వర్గం చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంతో ఇరు వర్గాల మధ్య గొడవ పెరిగి దాడులు జరిగాయి. ఇంతలో వెనుక నుంచి ఎవరో తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ తగిలి రామ్ గోపాల్ మిశ్రా అనే 22 ఏళ్ల ఒక వ్యక్తి మరణించగా.. కొందరికి గాయాలయ్యాయి. దీంతో గొడవలో హింస చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. గుర్తు తెలియని కొందరు పరిసరాల్లోని బైకులు, ఇళ్లు, షాపులకు నిప్పంటించారు.
Also Read: ఒక బాయ్ ఫ్రెండ్, ఇద్దరు గర్లఫ్రెండ్స్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో చివరికి రక్తపాతమే
బుల్లెట్ గాయంతో పడిపోయిన రామ్ గోపాల్ మిశ్రాని ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు అతను చనిపోయాడని ధృవీకరించారు. దీంతో అతని కుటుంబం, మిత్రులు ఆస్పత్రి బయట నిరసన చేశారు. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. అప్పటి వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని ఆస్పత్రి బయటే నిరసన చేశారు. ఈ ఘటన గురించి తెలిసి జిల్లాలోని దుర్గామాత ఊరేగింపు చేసేవారందరూ నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు విగ్రహాలు నిమజ్జనం చేసేది లేదని నిరసనకు దిగారు.
ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పోలీస్ శాఖపై మండిపడ్డారు. దుర్గా మాత ఊరేగింపులో భద్రతగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారని అడిగారు. నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.