Yamuna : ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఢిల్లీలో ప్రమాదకరస్థాయి 205.33 మీటర్లను దాటింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వానల వల్ల హత్నికుండ్ బ్యారేజ్ నుంచి యుమునా నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో నీటిమట్టం పెరిగింది. దీంతో ఢిల్లీకి మరోసారి వరదముప్పు పొంచి ఉంది.
హత్నికుండ్ బ్యారేజ్ నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ మంత్రి అతిషీ ప్రకటించారు.
గత వారం యమునా నది నీటి మట్టం 208.05 మీటర్లకు చేరింది. ఆ తర్వాత యుమునా నది శాంతించింది. దీంతో నీటి మట్టం 205.02 మీటర్లకు తగ్గింది. తాజాగా హత్నికుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడంతో మళ్లీ నీటిమట్టం పెరిగి 206.07 మీటర్లకు చేరుకుంది.
జులై 25 వరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా సహా యమునా ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు పోటెత్తుతున్నాయి. వరదల కారణంగా 27 వేల మంది తమ ఇళ్లను ఖాళీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.