Lottery: అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఒక్కసారి తలుపుతడితే ఓవర్నైట్లో కుటుంబ తలరాతే మారిపోతుంది. అలా జాక్పాట్ తగిలి కోటీశ్వరులైన వారు ఎందరో ఉన్నారు. తాజాగా పంజాబ్కు చెందిన ఓ వృద్ధుడికి 88 ఏళ్ల వయస్సులో జాక్పాట్ తగిలింది. సంక్రాంతి లాటరీలో ఏకంగా రూ. 5 కోట్లు గెలుచుకున్నాడు.
మహంత్ ద్వారకా దాస్ అనే వృద్ధుడు 1947లో పాకిస్థాన్ నుంచి వచ్చి పంజాబ్లోని డేరాబస్సిలో స్థిరపడిపోయాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మహంత్.. దాదాపు 40 ఏళ్లుగా లాటరీలను కొనుగోలు చేస్తున్నాడు. 40 ఏళ్లలో ఒక్కసారి కూడా లాటరీ తగలకపోయినా నిరాశ చెందకుండా కొనుగోలు చేస్తూ వచ్చాడు. ఏదో ఒక రోజు అదృష్టం తన తలుపు తడుతుందని మహంద్ గట్టిగా నమ్మేవాడు.
ఈక్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహంత్ ఓ లాటరీని కొనుగోలు చేశాడు. ఇటీవల డ్రా తీయగా అదే నంబర్కు లాటరీ తగిలింది. మొత్తం రూ. 5 కోట్లను మహంత్ గెలుచుకున్నాడు. అన్ని పన్నులు పోనూ మహంత్కు రూ. 3.5 కోట్లు అందనుంది. దీంతో మహంత్ సంతోషానికి అవదులు లేవు. పట్టరాని సంతోషంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లు అతనికి పూలమాలలు వేసి అభినందించారు.
40 ఏళ్ల తన కల ఇప్పుడు నెరవేరిందని మహంత్ ద్వారకా దాస్ తెలిపారు. తనకు వచ్చిన డబ్బులో సగం తన ఇద్దరు కొడుకులకు పంచి మిగతా సగాన్ని డేరాకు విరాళంగా ఇస్తానని వెల్లడించాడు.