Odisha: నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిదండ్రుల్ని పెద్దయ్యాక కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలే వారిపాలిట రాక్షసులు అవుతున్నారు. ఆస్తికోసం కొందరు చంపేస్తుంటే.. ఇంకొందరు లేనిపోని కారణాలు చెప్పి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తన పంటలో క్యాలీఫ్లవర్ కోసిన తల్లిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడో కసాయి కొడుకు. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్లోని సరపసి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ తల్లికి ఇద్దరు కొడుకులు ఉండగా.. వివాహాలు అయ్యాయి. వ్యవసాయం చేసుకుంటూ వేర్వేరుగా జీవిస్తున్నారు.
చిన్నకొడుకు శతృఘ్న మహంత (39) క్యాలీఫ్లవర్ పంటను సాగు చేస్తున్నాడు. కూర వండుకునేందుకు తల్లి ఆ పంట నుంచి ఒక క్యాలీఫ్లవర్ ను కోసుకుంది. అది చూసిన శత్రఘ్న.. తన అనుమతి లేకుండా ఎందుకు తీసుకున్నావని దుర్భాషలాడుతూ తల్లిని నిలదీశాడు. అంతటితే ఆగకుండా వృద్ధురాలిని స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. శత్రుఘ్న తీరుపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతనిపై కేసు నమోదైంది.