AAP MP Sanjay Singh Released From Jail: సంబరాలు చేసుకునే సమయం కాదు.. ఇది పోరాడే సమయం అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ పిలుపునిచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీం కోర్ట్ మంజూరు చేసిన బెయిల్ను అనుసరించి బుధవారం సాయంత్రం సింగ్ జైలు నుంచి బయటకువచ్చారు.
తీహార్ జైలు వెలుపల గుమిగూడిన ఆప్ మద్దతుదారులు సంజయ్ సింగ్కు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ఆయన మీద పూల వర్షం కురిపించారు. పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలు నినాదాలతో తీహార్ జైలు పరిసరాలను హోరెత్తించారు. సంజయ్ సింగ్ విడుదల అతనికి మాత్రమే కాదు, ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్ట్తో చిన్నబోయిన ఆప్ శ్రేణులకు పెద్ద ఉపశమనం. అతని రాక ఆప్ కార్యకర్తలకు మరింత ప్రోత్సాహానిస్తోంది.
Also Read: AAP MP Sanjay Singh: మనీలాండరింగ్ కేసు.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్..
జైలు నుంచి విడుదలైన సందర్భంగా సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఇది సంబరాలు చేసుకునే సమయం కాదు, ఇది పోరాట సమయం.. ఇక సమరమే అని ఆప్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి సింగ్ నేరుగా కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన భార్య సునీత కేజ్రీవాల్ను కలిశారు.