ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు కలవరపెడుతున్న వేళ… గడ్డు కాలంలోనూ భారత ఎకానమీ దూకుడు కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది… అసోచామ్. ఈ ఏడాది కూడా పటిష్ట వినియోగ డిమాండ్, మెరుగైన కార్పొరేట్ పనితీరు, తగ్గుముఖం పడుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తాయని అభిప్రాయపడింది.
గ్లోబల్ ఎకానమీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా… బలమైన దేశీయ డిమాండ్, పటిష్ట ఆర్థిక రంగం, మెరుగైన కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు… భారత ఆర్థిక వ్యవస్థను స్థిరమైన బాటలో నిలుపుతాయంటోంది… అసోచామ్. రబీ పంటలు బాగుంటాయనే సంకేతాలతో వ్యవసాయ రంగం సానుకూల పనితీరును కనబరచవచ్చని అంచనా వేస్తోంది. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్తో పాటు… ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ప్రత్యేక రసాయనాలు, ఎరువుల వంటి అనేక పరిశ్రమల పనితీరు బాగుందని… పర్యాటకం, హోటళ్లు, రవాణా, గృహ కొనుగోళ్లు, విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ విభాగాల్లోనూ చక్కటి వినియోగ డిమాండ్ కనిపిస్తోందని… ఇది ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని సూచిస్తుందని అసోచామ్ నివేదిక వెల్లడించింది.
ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల పర్యవసానాలు మన దేశంపై పడకుండా భారత్ అప్రమత్తంగా ఉండాలని అసోచామ్ హెచ్చరించింది. అంతర్జాతీయ కరెన్సీ హెచ్చుతగ్గుల విషయంలోనూ జాగ్రత్తలు అవసరమని సూచించింది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని… ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాలతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వెల్లడించింది. అధిక వడ్డీ రేట్ల ప్రభావం భారత కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లపై కూడా పడుతున్నా… ప్రతికూల పరిస్థితులను భారత్ కార్పొరేట్ రంగం అధిగమిస్తోందని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేవలం 2.7 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసినా… భారత ఎకానమీ మాత్రం 6.8 శాతం నుంచి 7 శాతం పురోగమిస్తుందని అశాభావం వ్యక్తం చేసిన అసోచామ్… వచ్చే ఏడాది కూడా ఇదే సానుకూలత కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పింది.