Nitin Gadkari: ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలను కాంగ్రెస్ వక్రీకరించిందని, ఆపార్టీ వెంటనే తనకు క్షమాణలు చెప్పాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ డిమాండ్ చేశారు. గ్రామస్తులు, పేదలు, రైతులు, కూలీలు సంతోషంగా లేరు. “గ్రామాల్లో మంచి రోడ్లు లేవు. త్రాగునీరు, మంచి ఆసుపత్రులు, పాఠశాలలు అందుబాటులో లేవు” అంటూ గడ్కరీ మాట్లాడినట్లుగా ఉన్న వీడియోను కాంగ్రెస్ పార్టీ పోస్టు చేసింది.
ఈ ప్రభుత్వ హాయంలో తీసుకుంటున్న చర్యల గురించి తాను చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి ఈ పోస్టు పెట్టారంటూ మంత్రి గడ్కారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భం ఉద్దేశాన్ని బయటపెట్టకుండా, అర్థం మారేలా ఆ క్లిప్పింగ్ లో మార్పులు చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు, నన్ను కించపరిచేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నమిదని గడ్కారీ అన్నారు. భారతీయ జనతా పార్టీలో సైద్దాంతిక చీలికను సృష్టించేందుకు, సభ్యులను రెచ్చగొట్టే దురుద్దేశపూర్వక చర్యే ఇది అని తన నోటీసుల్లో గడ్కరీ విమర్శించారు. నోటీసులు అందించిన 24 గంటల్లో తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మూడు రోజుల్లోగా రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.