NITI Aayog Meeting : ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఉన్న కల్చరల్ సెంటర్ లో శనివారం నీతి అయోగ్ సమావేశం ప్రారంభమైంది. 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి అయోగ్ వైస్ చైర్మన్, ప్రత్యేక ఆహ్వానితులు, సభ్యులు హాజరయ్యారు.
వికసిత్ భారత్ 2047 ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. 2047 సంవత్సరానికల్లా భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.
కాగా.. నీతి అయోగ్ పాలకమండలి సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. సమావేశంలో మమతా మాట్లాడుతుండగా.. ఆమె మైక్ ను కట్ చేయడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు. ఇటీవల లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను రాజకీయ వివక్షతో రూపొందించారని మండిపడ్డారామె. దీనిపై ప్లానింగ్ కమిషన్ ను తీసుకురావాలని మమతా డిమాండ్ చేశారు.