Nithyananda : స్వామి నిత్యానంద ఈ పేరు ఒకప్పుడు భారత్ లో హాట్ టాపిక్. ఓ నటితో శృంగార దృశ్యాలు బయటకు రావడంతో దేశంలో తీవ్ర దుమారం రేగింది. ఆ తర్వాత ఆయనపై ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి.
నిత్యం ఏదో ఒక వివాదం నిత్యానంద చుట్టూ తిరిగేది. ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు.
దేశం నుంచి వెళ్లిపోయిన కొన్నాళ్లకు నిత్యానంద సంచలన ప్రకటన చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో ఒక దేశాన్ని సృష్టించుకున్నానని ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రత్యేక దేశం తరఫున ఇద్దరు ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరయ్యారు. విజయప్రియ నిత్యానందగా పరిచయం చేసుకున్న ఓ మహిళా ప్రతినిధి.. జెనీవాలో జరిగిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. నిత్యానందను భారత ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపణలు చేశారు. హిందువుల కోసం తొలి సార్వభౌమ దేశం కైలాసను ఏర్పాటు చేసిన నిత్యానంద హిందూ సంప్రదాయాలను, నాగరికతను పునరుద్ధరిస్తున్నారని వివరించారు. కైలాస నుంచే వచ్చిన మరో ప్రతినిధి ఈఎన్ కుమార్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.
అత్యాచారం, అపహరణ లాంటి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందపై భారత్లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీంతో 2019లో దేశం నుంచి ఆయన పారిపోయారు. 2020లో ఈక్వెడార్ తీరానికి దగ్గర్లోని ఓ ద్వీపాన్ని కొనుగోలు చేశారు. ఆ ప్రాంతాన్ని కైలాస దేశంగా ప్రకటించారు.
ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందాలంటే భద్రతా మండలి, సర్వప్రతినిధి సభ ఆమోదం ముందుగా అవసరం. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో 193 దేశాలున్నాయి. ఈ జాబితాలో కైలాస లేదు. జెనీవా చర్చలో పాల్గొనడం ద్వారా ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించిందనే తప్పుడు అభిప్రాయం కల్పించేందుకు యూఎస్కే ప్రతినిధులు ప్రయత్నించారని పరిశీలకులు అంటున్నారు.