NIA Releases Rameshwaram Cafe Blast Suspect Photo: బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్లో బ్లాస్ట్కు కారణమైన వ్యక్తిగా అనుమానిస్తోన్న వ్యక్తి ఫోటోలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విడుదల చేసింది. మార్చి 3న కేసును స్వాధీనం చేసుకున్న యాంటీ టెర్రర్ ఏజెన్సీ, మార్చి 1న బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని అమర్చినట్లు భావిస్తున్న నిందితుడిని గుర్తించడంలో ప్రజల సహాయాన్ని కోరింది.
కేఫ్లో పేలుడు జరిగిన గంట తర్వాత ప్రధాన నిందితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. ఆ సీసీటీవీ ఫుటేజీలో టైమ్ మార్చి 1 మధ్యాహ్నం 2:03 గా రికార్డ అయ్యింది. అటు కేఫ్లో బ్లాస్ట్ మధ్యాహ్నం 12:56 గంటలకు జరిగినట్లు కేఫ్ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. దీంతో అతడు ఆ బ్లాస్ట్ చేసి తీరిగ్గా బట్టలు మార్చుకొని బస్సు ఎక్కి ఉంటాడని NIA అనుమానిస్తోంది.
అదే రోజు రాత్రి 9 గంటలకు మరో ఫుటేజీలో, అనుమానితుడు బస్ స్టేషన్లో తిరుగుతున్నట్లు గమనించారు. అనుమానితుడిని గుర్తించడానికి, అతన్ని పట్టుకోవడానికి దారితీసే ఏదైనా సమాచారంతో ముందుకు రావాలని పౌరులను NIA కోరింది. విలువైన సమాచారం అందిస్తే ₹ 10 లక్షల రివార్డును అందజేయనున్నట్లు NIA తెలిపింది.
బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో NIAకి సహకరిస్తోంది. ఈ కేసుకు సంబంధించి బళ్లారి జిల్లాలోని కౌల్ బజార్కు చెందిన ఒక బట్టల వ్యాపారిని, నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి సంబంధించిన క్యాడర్ను అరెస్టు చేశారు.
Read More: అది బాంబు దాడే.. బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడుపై కర్ణాటక సీఎం..
ఘటనానంతరం నిందితుడు దుస్తులు మార్చుకుని బస్సులో ప్రయాణించినట్లు విచారణ బృందం తెలిపింది.
పటిష్ట భద్రతా చర్యలతో రామేశ్వరం కేఫ్ శనివారం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. డిటెక్టర్లను ఉపయోగించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read More: రామేశ్వరం కేఫ్ నిందితుడి ఆచూకీ కోసం ఎన్ఐఏ భారీ నజరానా
రామేశ్వరం కేఫ్ సహ వ్యవస్థాపకుడు, CEO అయిన రాఘవేంద్రరావు మాట్లాడుతూ, “మేము మా భద్రతా బృందాన్ని బలోపేతం చేసాము. మా అన్ని శాఖలలో మా సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇవ్వగల మాజీ సైనికులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాము” అని తెలిపారు.