Terrorist Attack(National News Updates): జమ్మూకశ్మీర్ లోని పూంజ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ ప్రభుత్వం యాక్షన్ మొదలుపెట్టింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను NIAకు అప్పగించింది. నేడు ఘటనా స్థలిని NIA అధికారులు పరిశీలించనున్నారు. మరోవైపు దాడి తమ పనేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ ప్రకటించుకుంది.
గురవారంలో జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ల దాడిలో ఐదుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని రాజౌరిలోని సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ జవాన్లు రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందినవారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు వీరిని మోహరించామని సైన్యం తెలిపింది.
సైనికులు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్కు భింబర్ గలీ నుంచి సాంగియోట్కు వెళ్తుండగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దాడి జరిగింది. తొలుత పిడుగుపాటు వల్ల ట్రక్కులో మంటలు చెలరేగాయి అనే అనుమానాలు వచ్చాయి. కానీ ఉగ్రవాదుల దాడేనని దర్యాప్తులో తేలింది. ఘటన వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్కు సైన్యాధిపతి మనోజ్ పాండే వివరించారు. భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితులను ఉగ్రవాదులు అవకాశం తీసుకుని దాడికి పాల్పడ్డారని సైనికాధికారులు భావిస్తున్నారు.