Corona Virus : దేశంలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. అంతమైపోయిందనుకున్న కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్ జేఎన్.1 రూపంలో ప్రపంచ దేశాలను మళ్లీ గడగడలాడిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ కేసులు ఇప్పుడు భారత్లోనూ నమోదవుతున్నాయి. ఏడు నెలల తర్వాత కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 614 కరోనా కేసుల నమోదవ్వగా.. ఈ మహమ్మారి బారినపడి ముగ్గురు మృతి చెందారు.
అత్యధికంగా కేరళలో ఇప్పటి వరకు 293 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఒక్క గోవాలోనే 19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తమిళనాడులో 13, మహారాష్ట్రలో 11, కర్నాటకలో 9, తెలంగాణలో 4, పుదుచ్చెరిలో 4, పంజాబ్, గోవాలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి.
మే 21 తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కొత్త వేరియంట్ రూపంలో మహమ్మారి మళ్లీ ప్రపంచ దేశాలను కలవర పెడుతుండటంతో.. అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కొత్త వేరియంట్ కదలికలను నిశితంగా గమనిస్తూ.. టెస్టింగ్ కేంద్రాలను పెంచాలని రాష్ట్రాలకు సూచించింది . ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, వ్యాక్సిన్ల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో రాష్ట్రాలకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపింది. కేసుల సంఖ్య, టెస్టింగ్ వివరాలతోపాటు ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు కొవిడ్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించింది. ప్రతి మూడు నెలలకొకసారి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్లు నిర్వహించాలని ఆదేశించింది కేంద్రం.
దేశంలోని మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అప్రమత్తమైన కేంద్రం.. కరోనా టెస్టులపై దృష్టి సారించింది. దేశంలో కోవిడ్ పరిస్థితిపై కేంద్రం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి..కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా ముందుకు సాగాలని కోరారు.
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు మంత్రి దామోదర రాజనర్సింహ. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా, డీహెచ్ రవీంద్ర నాయక్, డీఎంఈ త్రివేణి, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు, ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర సహా పలువురు ఉన్నతాధికారులకు..పలు సూచనలు చేశారు. అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ పూర్తి చేయాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే కొవిడ్ టెస్టులు చేయాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను ఉప్పల్లోని సీడీసీకి పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.31 శాతంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు .