New Toll Rates: పార్లమెంట్ ఎన్నికలకు ముందు వాహనదారులకు భారీ శుభవార్త. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెంచుతామన్న టోల్ ఛార్జీలను ప్రస్తుతానికి వాయిదా వేయాలని ఎన్హెచ్ఏఐకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. లోక్ సభ ఎన్నికల తర్వాతనే కొత్తగా పెంచిన టోల్ ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికల ముందు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏటా ఏప్రిల్ 1 నుంచి పెరగబోయే టోల్ ఛార్జీలను లోక్ సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు వాయిదా వేయాలని సూచించింది. కేంద్రం రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వినతి మేరకు ఎన్నికల సంఘం ఎన్హెచ్ఏఐకు ఆదేశించింది.
ఎన్నికలు ముగిసే వరకు పాత ఛార్జీలే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు ఈసీ ఆదేశించింది. దీంతో ఎన్నికల పుణ్యమా అని వాహనదారులకు కొన్ని రోజుల పాటు అధిక టోల్ వసూళ్ల నుంచి ఊరట లభించింది. అయితే ప్రతి ఏటా ఏప్రిల్ 1న టోల్ ఫీజు అనేది పెరుగుతుంటుంది. ఈ పెంపు సగటు 5 శాతం వరకు ఉంటుంది.
Also Read: Supreme Court: వీవీ ప్యాట్ ఓటు స్లిప్స్ లెక్కింపు.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
కాగా, పెరిగిన టోల్ ఛార్జీలు ఆదివారం రాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో టోల్ ఫీజు పెంచవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో.. వసూలు చేసిన మొత్తాలను వాహనదారులకు వెనక్కి వేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.