New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈనెల 28న మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి మోదీ, లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాతో కలిసి నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు.
2021లో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టింది. 970 కోట్లతో 64వేల 500 చదరపు మీటర్ల స్థలంలో పార్లమెంట్ భవన నిర్మాణం చేశారు.
పాత పార్లమెంట్ భవనాన్ని 1927లో నిర్మించారు. ఆ భవనాన్ని నిర్మించి దాదాపు వందేళ్లు కావస్తుండడం, ప్రస్తుత అవసరాల దృష్ట్యా నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి లోక్సభ, రాజ్యసభలు తీర్మానాలను ఆమోదించాయి. 2020 డిసెంబర్ 10న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపు రెండేళ్లలోనే నిర్మాణం పూర్తవడం విశేషం.
పాత పార్లమెంట్ భవనంలో లోక్సభలో 545 మంది, రాజ్యసభలో 250 మంది సభ్యులు కూర్చునే సీటింగ్ కెపాసిటి ఉండేది. కొత్త భననంలో లోక్సభలో 888 మంది సభ్యులు, రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునేలా సీటింట్ కెపాసిటీని ఏర్పాటు చేశారు.
సెంట్రల్ విస్తా భవన సముదాయ వరుసక్రమంలో త్రిభుజాకారంలో పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టారు. ఇందులో లోక్సభ, రాజ్యసభ సభ్యులు, రాజ్యాంగబద్ధ సంస్థల కార్యాలయాలు ఉంటాయి.
కొత్త లోక్సభ ఛాంబర్ను జాతీయ పక్షి నెమలి ఆకృతిలో నిర్మించారు.
రాజ్యసభ ఛాంబర్ను జాతీయ పుష్పం ఆకృతిలో నిర్మించారు.
స్పీకర్ కుర్చీ పక్కనే బంగారు రాజదండం సెంగోల్ను అమర్చుతున్నారు.
పార్లమెంట్ భవనానికి మరొక ఆకర్షణ రాజ్యాంగ హాల్. ఇది దేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించడానికి నిర్మించబడింది. భారత రాజ్యాంగం అసలు ప్రతిని హాలులో ఉంచారు. భవనంలోనే పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు కొన్ని కమిటీ గదులు కూడా ఉన్నాయి.
కొత్త పార్లమెంట్ హౌస్లో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మాజీ ప్రధానుల ఫోటోలు కొలువుతీరనున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది జులైలో కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు.
కొత్త పార్లమెంట్ భవనాన్ని పూర్తిగా భూకంపం తట్టుకునేలా తీర్చిదిద్దారు. బహిరంగ ప్రాంగణానికి అనుబంధంగా సెంట్రల్ లాంజ్ ఉంది. ఇందులో జాతీయ వృక్షం మర్రి చెట్టు ఉంటుంది.
ఆధునిక భారతదేశపు వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రాంతీయ కళలు, చేతికళతో చిత్రాలను కొత్త పార్లమెంట్ భవనంలో పొందుపర్చారు.
భవనంలో సురక్షితమైన, సమర్థవంతమైన కమ్యూనికేషన్ టెక్నాలజీతో అల్ట్రా మోడ్రన్ ఆఫీస్ స్పేస్ ఉంటుంది.
పార్లమెంట్ సజావుగా సాగేందుకు కొత్త, పాత భవనాలు కలిసి పనిచేస్తాయి.