New Government in Haryana : మరికొద్ది రోజుల్లోనే హరియాణాలో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మేరకు అక్టోబర్ 17న పంచకులలో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు బీజేపీ శనివారం ప్రకటన చేసింది.
మరోవైపు నాయబ్ సింగ్ సైనీ హరియాణా సీఎంగా రెండోసారి పగ్గాలు చేపట్టేందుకు మెండుగా అవకాశాలున్నాయి. గత మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ స్థానాన్ని నాయబ్ సింగ్ సైనీతో భర్తీ చేసింది బీజేపీ అధిష్టానం.
బీజేపీకే పట్టం…
దీంతో సీఎంగా ఎన్నికలకు వెళ్లిన సైనీకి, రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పడితే తిరిగి ఆయన్నే ముఖ్యమంత్రిని చేస్తామన్న సంకేతాలు ఆనాడే వెలువడ్డాయి. ఈ క్రమంలోనే మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లు దక్కించుకుని అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న ఏకైక పార్టీగా నిలిచింది. ఇంకోవైపు కాంగ్రెస్ 37 స్థానాలకే పరిమితమైపోయింది. ఇక ఐఎన్ ఎల్డీ కేవలం 2 స్థానాలతోనే సరిపెట్టుకోగా, జేజేపీ, ఆప్లు మాత్రం ఖాతా తెరవకుండానే ఎన్నికలు ముగించేయడం గమనార్హం.
మనోహర్ లాల్ ఖట్టర్ …
2024 పార్లమెంట్ ఎన్నికల కోసం సీఎం పదవిని త్యాగం చేశారు మనోహర్ లాల్ ఖట్టర్. పార్టీ ఆదేశాల మేరకు హరియాణా ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి తన వారసుడిగా నాయబ్ సింగ్ సైనీకి బాధ్యతలు అప్పగించారు.
అనంతరం మూడోసారి కొలువుదీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. 2024 నుంచి కేంద్ర విద్యుత్ మంత్రిగా, గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు. 2014 అక్టోబరు 26 నుంచి 2024 మార్చి 12 వరకు హరియాణ 10వ ముఖ్యమంత్రిగా కొనసాగడం విశేషం.
Also Read : భారత్ను అస్తిరపర్చేందుకు బంగ్లాదేశ్లో భారీ కుట్రలు : ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్