Ayodhya : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ దశరథ రామయ్యకు వివిధ ప్రాంతాల నుంచి కానుకలు వస్తున్నాయి. ఇలా ఎన్ని ప్రాంతాల నుంచి కానుకలు వచ్చినా.. అత్తారింటి నుంచి వచ్చే కానుకలు చాలా ప్రత్యేకం. సీతమ్మ తల్లి జన్మించిన నేపాల్ నుంచి రామయ్యకు కానుకలు వచ్చాయి. నేపాల్ లోని జనక్ పుర్ నుంచి వందలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు.
సుమారు 800 మంది భక్తులు 500 కానుకల డబ్బాలతో అయోధ్యకు వచ్చారు. భక్తులు తీసుకొచ్చిన కానుకలలో శ్రీరాముడి కోసం వెండి పాదరక్షలు, వెండి విల్లు, బాణం, కంఠహారాలు, గృహోపకరణాలు, పట్టు వస్త్రాలు ఉన్నాయి. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరగుతున్నందుకు తమకెంతో సంతోషంగా ఉందని జనక్ పుర్ ఆలయ పూజారి అన్నారు. జనకుడు సీతారాముల వివాహ సమయంలో ఎన్నో కానుకలు ఇచ్చాడని తామూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని నేపాలీ భక్తులు అన్నారు.