NDA meeting in delhi today(BJP India latest news): ఢిల్లీ వేదికగా మంగళవారం ఎన్డీఏ కీలక భేటీ జరగబోతోంది. ప్రతిపక్షాల ఐక్యతా సమావేశానికి ధీటుగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. గతంలో దూరమైన మిత్ర పక్షాలను అక్కున చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి ఏర్పాట్లు చేసింది. ఈ భేటీకి 38 పార్టీలు హాజరవుతాయని బీజేపీ నేతలు తెలిపారు.
లోక్సభ ఎన్నికలకు ఇంకా 9 నెలలే సమయం ఉంది. ఒకవైపు 9 ఏళ్ల మోదీ పాలనలో అమలు చేసిన పథకాలు , చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలను బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టింది. మరోవైపు కొత్త పొత్తుల కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. కొత్త పార్టీలను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తోంది. గతంలో ఎన్డీఏలో ఉండి తర్వాత బయటికి వెళ్లిన పార్టీలను తిరిగి కలుపుకునే చర్యలు చేపట్టింది.
ఎన్డీఏలో తిరిగి చేరుతున్నట్లు సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓపీ రాజ్భర్ తాజాగా ప్రకటించారు. 2019లో ఎన్డీఏ నుంచి ఆయన బయటకు వచ్చారు. ఉత్తర్ప్రదేశ్లోని తూర్పు ప్రాంతంలో ఓబీసీ ఓటర్లపై రాజ్భర్కు పట్టు ఉంది. ఇక బిహార్లో లోక్ జనశక్తి పార్టీలో చీలిక తెచ్చిన చిరాగ్ పాశ్వాన్ను కూడా ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి జేపీ నడ్డా ఆహ్వానించారు. ఏపీ నుంచి జనసేనను ఆహ్వానించారు.
బిహార్ సీఎం నేతృత్వంలోని జేడీయూ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, అకాలీ దళ్ లాంటి పార్టీలు బీజేపీతో విభేదించి ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నాయి. AIDMKను, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలు, నాయకులను ఎన్డీఏ సమావేశానికి జేపీ నడ్డా ఆహ్వానించారు. ప్రధానిగా మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఎన్డీఏ భేటీ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అటు బెంగళూరులో విపక్షాల సమావేశం రెండోరోజు జరగనుంది.