Nayab Singh Saini : హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. పంచకులలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమి జాతీయ స్థాయి అగ్రనేతలు హాజరయ్యారు.
డబుల్ ఇంజిన్ సర్కార్…
అంతకుముందు ఆయన వాల్మీకి ఆలయంలో పూజలు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హరియాణా వేగంగా ముందుకెళ్తుందని సైనీ అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనీతో ప్రమాణం చేయించారు.
ఇక విశిష్ట అతిథులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీకి రాజయోగం…
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భాజపా అనూహ్య విజయాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీకి 48 మంది ఎమ్మెల్యేలను గెల్చుకుంది బీజేపీ.
సైనీనే సేనాని…
పార్టీ దిల్లీ అగ్ర నాయకత్వం చొరవతో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సీఎం నాయబ్ సింగ్ సైనీవైపే ఎమ్మెల్యేలంతా మొగ్గు చూపారు. అనంతరం సీఎం ఎంపికపై జరిగిన చర్చల్లో అంతా జై నాయబ్ అన్నారు.
శాసనసభాపక్ష నేతగా సైనీ…
బుధవారమే భాజపా శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈమేరకు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్ సైనీ పేరును ప్రతిపాదించారు. దీంతో ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే ఇవాళ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు.
మరోవైపు గవర్నర్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కూడా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం చంద్రబాబు, చత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తదితరుల సమక్షంలో సైనీ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు.
also read : ‘అస్సాంలో వలసదారులకు పౌరసత్వం సబబే’.. 1953 పౌరసత్వ చట్టంపై సుప్రీం కీలక తీర్పు