Haryana Nayab Singh Saini : హరియాణాలో ముచ్చటగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ మేరకు సీఎంగా నాయబ్ సింగ్ సైనీ మరోసారి ఖరారయ్యారు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సైనీ మరోసారి ఆ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం హరియాణా భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఏకగ్రీవం…
రాజధాని చండీగఢ్లో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా సైనీని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా భారత హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. అనంతరం నాయబ్ సింగ్ సైనీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
హరియాణాలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నాయబ్ సింగ్ సైనీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారని, సుమారు 15 ఏళ్ల పాటు ఇక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటుందన్నారు.
ఓటర్లు తిరస్కరించారు…
మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నాయకత్వంలో రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయని, అగ్నివీర్లపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలను ఓటర్లు తిరస్కరించారని వెల్లడించారు. ఇకపై ప్రతి అగ్నివీర్కు పెన్షన్తో కూడిన ఉద్యోగాన్ని ఇస్తామన్నారు.
మరోవైపు బీజేపీ పక్ష నేతగా ఎన్నికైన సైనీ ఏమన్నారంటే, హరియాణా ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ విధానాలపై నమ్మకం పెట్టుకున్నారు కాబట్టే మరోసారి కషాయ ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు వివరించారు. ఫలితంగానే ముచ్చటగా మూడోసారి తమ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారన్నారు.
అమిత్ షా సమక్షంలో…
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇందుకు ఆయన దార్శనికతను తామంతా ముందుకు తీసుకెెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. సర్కారును ఏర్పాటు చేసేందుకు అనుమతి కోసం రాజ్భవన్కు వెళ్లారు సైనీ. అనంతరం గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. హోంశాఖ మంత్రి అమిత్షా సైతం ఈ కార్యక్రమంలో ఉండటం గమనార్హం.
అంగరంగ వైభవంగా…
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తోపాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇక ఎన్డీఏ పక్ష భాగస్వామ్యం ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
హరియాణా సీఎంగా ఉన్న మనోహర్లాల్ ఖట్టర్ ను లోక్ సభ ఎన్నికల ముంగిట ఆయనతో రాజీనామా చేయించింది బీజేపీ అధిష్టానం. ఆయన స్థానంలో సైనీని ఇదే ఏడాది మార్చిలో సీఎంను చేశారు. ఫలితంగా రాష్ట్రంలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకంగా మారింది. ఫలితంగానే సైనీకి మరోసారి ప్రభుత్వాధినేతగా కొనసాగించేందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
48 సీట్లు కైవసం…
అక్టోబరు 8న హరియాణా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 90 స్థానాలు ఉన్న శాసనసభలో బీజేపీ 48 సీట్లు గెలుచుకుని ఆశ్చర్యపర్చింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. చాలా కాలం తర్వాత అధికారం హస్తానికి రానుందని, ఎగ్జిట్ పోల్స్ సైతం కోడై కూశాయి. వాటి అంచనాలను పటాపంచలు చేస్తూ బీజేపీ మూడోసారి జయకేతనం ఎగరేసింది.
also read : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. పంజాబ్, హర్యాణా ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్!