Naveen Patnaik resigns as Odisha CM: ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నవీన్ పట్నాయక్ రాజీనామా చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్ ను కలిసి, తన రాజీనామా లేఖను అందించారు. కొద్దిసేపటికి.. నవీన్ పట్నాయక్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంతవరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉండాలంటూ నవీన్ పట్నాయక్ ను కోరారు.
ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎన్నికలు కూడా నిర్వహించారు. ఈ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ విజయ దుందుభి మోగించింది. రాష్ట్రంలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అందులో బీజేపీ 78 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో బీజేపీకి మెజారిటీ సీట్లు దక్కాయి. బిజదకు 51 సీట్లు, కాంగ్రెస్ కు 14 సీట్లు, ఇతరులకు 4 సీట్లు దక్కాయి. దీంతో ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చాయి. అదేవిధంగా ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలు ఉండగా 20 చోట్లా కూడా బీజేపీ విజయం సాధించింది. మిగతా ఒక్కచోట మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, లోక్ సభ ఎన్నికల్లో బిజూ జనతా దళ్ పార్టీ మాత్రం ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లను కైవసం చేసుకోవడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీ చర్చ నడుస్తోంది. రెండున్నర దశబ్దాల తరువాత రాష్ట్ర సీఎంగా కొత్త వ్యక్తి రానుండటంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. బీజేపీ తరఫున కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మాజీ మంత్రి జోయల్ ఓరం, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు భైజయంత్ పండ ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు సమాచారం.
Also Read: “నా ఎత్తు ఎంతో నాకు తెలుసు.. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పా”
అయితే, వీరంతా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడంతో ఒడిశా సీఎంగా కొత్తవారిని బీజేపీ పరిచయం చేసే అవకాశం ఉందంటూ స్థానికంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒడిశాను 24 ఏళ్లపాటుగా ఏకధాటిగా పాలించినటువంటి బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ కు తొలిసారి ఓటమి ఎదురవ్వడం, నవీన్ పట్నాయక్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎవరిని తీసుకువస్తుందనే విషయంపై ఉత్కంఠ ఆ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతోంది.