Rahul Gandhi rising voice against Modi as opposition party leader
ఆయనో పప్పు, పుష్పం,రాజకీయ పరిజ్ణానం లేని ఓ తల్లిచాటు బిడ్డ. ఇవన్నీ మోదీ రాహుల్ గాంధీకి ఇచ్చిన నిక్ నేమ్స్. అది నిన్నటి మాట. ఇప్పుడు రాహుల్ అంటే ఫ్లవర్ అనుకొంటివా..ఫైర్ అనే స్థాయిలో స్వరం మారిపోయింది. వారసత్వంతో వచ్చే పదవులు తనకు వద్దనుకున్నాడు. తనని తాను నిరూపించుకున్నాకే ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు చేపట్టాడు రాహుల్ గాంధీ. గడిచిన రెండు పర్యాయాలు మోదీ ప్రతిపక్షాలను తన దరిదాపులకు కూడా రానీయకుండా చేశారు. ఈ సారి ఆ పప్పులు ఉడకలేదు. నాలుగొందలు స్థానాలు వస్తాయని ఢంకా బకాయించిన మోదీకి సొంత పార్టీ బలం చాలక మిత్రపక్షాల సహకారంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.
రాహుల్ కే జై అంటున్న కూటమి
ఇండియా కూటమి కి కూడా ఇప్పుడు రాహుల్ గాంధీయే మోదీకి సరైన ప్రత్యామ్నాయం అనుకునేలా చేస్తున్నాడు రాహుల్ గాంధీ. మూడో సారి అధికారంలోకి వచ్చిన మోదీ గతంలో మాదిరిగా ప్రసంగాలలో పదును తగ్గింది. విపక్ష నేతలను ఎదుర్కోవడంలో తడబడుతున్నారు. మొన్నటి పార్లమెంట్ సభలో రాహుల్ ప్రసంగాలు, మోదీని ధీటుగా ఎదుర్కొన్న తీరుకు యావత్ కాంగ్రెస్ అభిమానులు సంబరపడిపోతున్నారు. కాబోయే దేశ్ కీ నేత అంటూ కితాబుని ఇస్తున్నారు.
మత రాజకీయాలపై ఫైర్
మొన్నటి పార్లమెంట్ సమావేశాలలో రాహుల్ గాంధీ బీజేపీ మత రాజకీయాలను ఎండగట్టడంలో సఫలీకృతమయ్యారు. హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకుంటున్న బీజేపీకి తనదైన స్టయిల్ లో చెప్పారు. అసలు హిందూ మతం అంటే లోక శాంతి, పరమత సహనానికి, సత్యం, ప్రేమ, అహింసలకు అది అసలైన ప్రతిరూపం అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు హిందూ జాతిని ఉద్ధరించినపట్లు చెప్పుకుంటున్నారని వారి మాటలు నమ్మకపోవడం వలనే మొన్నటి ఎన్నికలలో ప్రజలు చావుదెబ్బ తీశారన్నారు.
తొలి ప్రసంగంతోనే
రాహుల్ గాంధీ తన తొలి ప్రసంగంలోనే బీజేపీని ఇరుకున పెట్టేలా మాట్లాడిన తీరు కు దేశ ప్రజలు ముగ్ధులవుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతం పేరుతో విధ్వేషాలను రెచ్చగొడుతున్నాయని మోదీ, యోగి, అమిత్ షా వీరెవ్వరూ హిందుత్వానికి ప్రతీకలు కారని, హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకుంటున్నారని..ఇక ఎక్కువ కాలం ప్రజలు వీళ్లని నమ్మే పరిస్థితి లేదని ఫైర్ అయ్యారు. ఇక రాహుల్ తొలి ప్రసంగంతోనే దేశ ప్రజలను ఆలోచనలో పడేసేలా చేశారు.
నిరుద్యోగుల సమస్యలపై నిలదీత
అలాగే నిరుద్యోగుల తరపున పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని..దీనిపై చర్చ జరగాలని పట్టుబట్టారు. రాహుల్ ప్రసంగం మధ్యలో మైక్ కట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇవ్నీ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీలో పరిణితిని చెబుతున్నాయి. ఇప్పుడు మోదీకి అసలైన అగ్నిపరీక్ష మొదలు కాబోతోంది. త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలలో విపక్షాల విమర్శలను ఎలా ఎదుర్కోవాలో అని బీజేపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి.
మణిపూర్ అంశంపై ఫైట్
ఈ సారి మణిపూర్ అంశాన్ని లేవనెత్తి మరోసారి మోదీ సర్కార్ ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేయబోతున్నారు రాహుల్. రీసెంట్ గా మణిపూర్ పర్యటించిన రాహుల్ గాంధీ ప్రధాని మోదీ కూడా మణిపూర్ పర్యటించాలని..అక్కడ క్షీణిస్తున్న శాంతిభద్రతలను పునరుద్ధరించాలని కోరుతున్నారు. అవసరమైతే పార్లమెంట్ లో మణిపూర్ సమస్యపై పోరాడతానని అక్కడి ప్రజలకు మాట ఇచ్చారు రాహుల్ గాంధీ. అందుకే రాబోయే పార్లమెంట్ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయా అని అంతా ఆసక్తగా ఎదురుచూస్తున్నారు.