Delhi Liquor Scam : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఓ హైదరాబాదీ పేరు రావడం సంచలనం రేపుతోంది. అతడు సైంటిస్టు కావడం విస్తు గొలుపుతోంది. లిక్కర్ స్కామ్ నిధుల మళ్లింపుపై ఈడీ ఛార్జిషీట్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. దుబాయ్ కంపెనీతోపాటు ఫై అనే కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే ప్రముఖ సైంటిస్ట్ ప్రవీణ్ గొరకవి పేరు తెరపైకి వచ్చింది. సీఏ బుచ్చిబాబుకు ప్రవీణ్ సన్నిహితుడని నిర్ధారించారు.
ప్రవీణ్ గొరకవి ఫై కంపెనీ ఫౌండర్గా ఉన్నారు. సైంటిస్ట్ అయిన ప్రవీణ్ పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఈ కుంభకోణంలోని నిధులను హవాలా మార్గంలో ప్రవీణ్ కంపెనీకి మళ్లించారని ఈడీ అభియోగం నమోదు చేసింది. గతంలోనూ ప్రవీణ్ కు కవాడిగూడలో ఉన్న ఇంటిపై ఈడీ దాడులు చేసింది. అప్పుడు రూ. 24 లక్షలు స్వాధీనం చేసుకుంది.
చిన్నతనంలో మేధావిగా ప్రవీణ్ ప్రశంసలు అందుకున్నాడు. బాలమేధావిగా గుర్తింపు పొందాడు. పలు ఆవిష్కరణలు చేసి మంచి పేరు సంపాదించాడు. గతంలో ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం నుంచి అవార్డు అందుకున్నాడు.
ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో తాజాగా నిందితులకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో నిందితులుగా ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్తోపాటు ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రురు బెయిల్ మంజూరైంది. రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో నవంబర్ 25న 10 వేల పేజీలతో ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ తొలి ఛార్జిషీట్ను సీబీఐ దాఖలు చేసింది. అయితే ఇప్పటికే మరో ఇద్దరు నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లికి సీబీఐ నమోదు చేసిన కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై సీబీఐకి న్యాయస్థానం నోటీసు ఇచ్చింది.