Professor GN Sai Baba Acquittal in Maoist Link Case(Today news paper telugu): ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.
అనుమానాస్పద మావోయిస్టు సంబంధాలపై అరెస్టయిన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మంగళవారం (మార్చి 5) నిర్దోషులుగా ప్రకటించింది.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని ట్రయల్ కోర్టు 2017లో నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పుపై న్యాయమూర్తులు వినయ్ జీ జోషి, వాల్మీకి ఎస్ఏ మెనేజెస్లతో కూడిన డివిజన్ బెంచ్ నిందితుల అప్పీళ్లను అనుమతించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది సెప్టెంబర్లో తీర్పు కోసం ధర్మాసనం ఈ కేసును ముగించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రాసిక్యూషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
2017లో ప్రత్యేక కోర్టు జీఎన్ సాయిబాబా, మహేశ్ కరీమన్ తిర్కీ, హేమ్ కేశవదత్త మిశ్రా, పాండు పోరా నరోటే, ప్రశాంత్ రాహీలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, విజయ్ తిర్కీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో వారు ఈ అప్పీళ్లను దాఖలు చేశారు.
వారు మార్చి 2017లో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో కోర్టు దోషులుగా నిర్ధారించింది. సాయిబాబాతో సహా ఐదుగురు దోషులకు జీవిత ఖైదు విధించింది; విజయ్ తిర్కీ మొదటిసారి నేరం చేసినందున అతనికి పదేళ్లపాటు కఠిన కారాగార శిక్ష విధించింది.
సాయిబాబా, ఇతర నిందితులు నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్), దాని ఫ్రంటల్ గ్రూప్ రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ సభ్యులనే ఆరోపణలపై మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులు 2013-2014 మధ్య అరెస్టు చేశారు.
Read More: ఎలక్టోరల్ బాండ్ల వివరాలకు గడువు ఇవ్వండి.. సుప్రీంను కోరిన ఎస్బీఐ..
సాయిబాబా నివాసంలో పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారన్న నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రోఫెసర్ సాయిబాబాను సస్పెండ్ చేసింది. పలు అనారోగ్య కారణాల దృశ్యా బాంబే హైకోర్టు 2015లో బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత పోలీసులు అతన్ని మళ్లీ అరెస్టు చేశారు. 2016లో అతనికి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత అతన్ని పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు.
2022 అక్టోబర్లో బాంబే హైకోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించింది. కాగా మరుసటి రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వీరి విడుదలపై స్టే విధిస్తూ ఏప్రిల్ 2023లో మళ్లీ విచారణ చేపట్టింది. వీరి అప్పీళ్లని మొదటినుంచి విచారణ జరపాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. కాగా నాగపూర్ బెంచ్ సాయిబాబా అప్పీళ్పై విచారణ జరిపించి మంగళవారం తుది తీర్పునిచ్చింది.
నిందితులపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద ఇచ్చిన అనుమతి చెల్లదని బాంబే హైకోర్టు న్యాయమూర్తులు వినయ్ జి జోషి, వాల్మీకి ఎస్ఎ మెనేజెస్లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం పేర్కొంది.
మెటీరియల్ ఎవిడెన్స్ను స్వాధీనం చేసుకోవడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, నిందితులకు వ్యతిరేకంగా ఎటువంటి నేరారోపణలను రుజువు చేయలేకపోయిందని కోర్టు ఎత్తి చూపింది. ట్రయల్ కోర్టు తీర్పును బెంచ్ పక్కన పెట్టింది. నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై ప్రాసిక్యూషన్ అప్పీళ్లు చేసుకోవచ్చని బెంచ్ స్పష్టం చేసింది. కాగా ఈ తీర్పుపై ప్రాసిక్యూషన్ స్టే విధించమని కోరకపోవడం విశేషం.