MRF share news today(Latest stock market news): భారతీయ స్టాక్మార్కెట్ చరిత్రలో ఇదో అరుదైన మైలురాయి. ఆటోమొబైల్ దిగ్గజం ఎంఆర్ఎఫ్ మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. టైర్ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న ఎంఆర్ఎఫ్ షేరు ధర.. తొలిసారి రూ.లక్ష మార్క్ను టచ్ చేసింది. ఈ ఏడాది 45 శాతానికి పైగా ఎగిసి.. భారతదేశపు అత్యంత ఖరీదైన స్టాక్గా రికార్డు క్రియేట్ చేసింది.
NSE, BSE రెండు మార్కెట్లలోనూ ఈ రికార్డ్ నమోదు చేసింది. MRF షేర్ విలువ ఒక దశలో లక్షా 439 రూపాయలు దాటి.. ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. అయితే మార్కెట్లు ముగిసే సమయానికి.. 99వేల 900 దగ్గర స్థిరపడింది.
క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఫలితాలు బాగుండటం.. కంపెనీపై మదుపర్లలో విశ్వాసం అధికంగా ఉండటంతో.. ఏడాది కాలంగా.. MRF కంపెనీ షేరు విలువ 46శాతం పెరిగింది. 2012 ఫిబ్రవరిలో ఈ షేర్ ధర తొలిసారిగా 10 వేల రూపాయలను దాటగా.. 2021 జనవరిలో 90 వేల మార్క్ ను దాటింది. అయితే అక్కడి నుంచి లక్ష మార్క్ ను టచ్ చేసేందుకు ఏకంగా రెండున్నరేళ్లకు పైగా సమయం పట్టింది.
కంపెనీ షేరు ధర పెరుగుతున్నా.. ఇప్పటివరకు షేర్లను విభజించలేదు. అలాగే ఇంతవరకు బోనస్ షేర్లను కూడా జారీ చేయలేదు. కానీ క్రమం తప్పకుండా షేర్ హోల్డర్లకు డివిడెండ్లను చెల్లిస్తూ వచ్చింది. షేర్ హోల్డర్లల్లో విశ్వసనీయతను కూడగట్టుకోవడం, కార్యకలాపాల విస్తరణ, చివరి త్రైమాసికంలో 5 వేల 725 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం వంటి పరిణామాలు ఈ షేర్ ధర పెరగడానికి కారణమైనట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏడాది MRF కంపెనీ ఆదాయం రూ. 23,261.17 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో ఇది రూ. 19,633.71 కోట్లుగా ఉంది. కంపెనీ నికర లాభం రూ.768.96 కోట్లుగా నమోదైంది.