Election Duty : ఐదు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎలక్షన్ డ్యూటీ చేయాల్సిన వారికి అధికారులు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఉపాధ్యాయుడు శిక్షణా తరగతులకు హాజరుకాకపోవడంతో.. అతనికి షోకాజు నోటీసులివ్వగా.. అందులో ఆయన ఇచ్చిన వివరణ చూసి ఉన్నతాధికారులు ఆగ్రహానికి గురయ్యారు. అధికారుల ఆదేశాలను విస్మరించడమే కాకుండా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినందుకు జిల్లా కలెక్టర్ సదరు టీచర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. అఖిలేశ్ కుమార్ మిశ్రా సాత్నా జిల్లాలో సంస్కృతం (Sanskrit) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతని వయసు 35 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల విధుల్లో పాల్గొనాలని ఉపాధ్యాయులందరితో పాటు ఈయనకు కూడా అధికారులు ఉత్తర్వులిచ్చారు. అక్టోబర్ 16,17 తేదీల్లో నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరు కావాలని కోరారు. కానీ అఖిలేశ్ కుమార్ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా.. శిక్షణ తరగతులకు గైర్హాజరయ్యారు. దాంతో ఎందుకు తరగతులకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ.. అధికారులు నోటీసులు జారీ చేశారు.
షోకాజ్ నోటీసులకు అఖిలేశ్ ఇచ్చిన వివరణ అధికారులకు కోపం తెప్పించింది. “నాకు 35 ఏళ్లొచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. బ్యాచిలర్ గా ఉండలేకపోతున్నా. జీవితాంతం భార్యలేకుండా ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందేమోనని భయమేస్తోంది. ముందు నాకు పెళ్లి చేయండి. ఆ తర్వాతే ఎన్నికల విధులకు వస్తాను” అని అక్టోబర్ 31న రిప్లై ఇచ్చారు. అంతేకాదు కట్నంగా తనకు రూ.3.5 లక్షల కట్నం, తాను ఉంటున్న ప్రాంతంలోనే ఒక ప్లాట్ ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ అతడిని సస్పెండ్ చేస్తూ నవంబర్ 2న ఆదేశాలిచ్చారు. అఖిలేశ్ కు ఫోన్ లేకపోవడంతో ఆ విషయం కూడా తెలియలేదు. ఆయన సహ ఉద్యోగి ఈ విషయం అఖిలేశ్ కు చెప్పడంతో.. ఈ ఘటన వెలుగుచూసింది. కాగా.. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఆయన సన్నిహితుడొకరు తెలిపారు.