Monkey pox virus in India(National news today India): కరోనా తగ్గిందిలే అనుకుంటే.. ఇప్పుడు మరో వైరస్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. ఈ వైరస్కి కూడా ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. మరో లాక్ డౌన్ రాకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని వెల్లడించింది. అసలు ఇంతగా భయపెడుతున్న ఈ వైరస్ ఏంటీ..? భారత్ దీన్ని ఎదుర్కోడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..?
కరోనా ప్రపంచాన్ని ఎంతగా కలవరపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడో ఒక్క కేసు వచ్చిందని తెలియగానే బోర్డర్లన్నీ అలర్ట్ అయ్యాయి. రాను రానూ ఒకొక్కటిగా కేసులు పెరుగుతూ… పదులు, వందలు, వేలుగా మారి మనుషులు పిట్టలు రాలినట్లు రాలిపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే… అంత్యక్రియలు చేయడానికి శ్మశానాలు సరిపోనంతగా.. కనీసం, చివరి చూపు కోసం కూడా నా అనుకునేవారు దగ్గరకు రాలేని పరిస్థితులు ఏర్పాడ్డాయి. అందుకే, అప్పటి నుండీ వైరస్ పేరు వింటేనే చాలా మందికి జ్వరం వచ్చినంత పనవుతుంది. సరిగ్గా, ఈ భయం మనల్ని వదిలిపెట్టక ముందే ఇప్పుడు మరో వైరస్ ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేంత ప్రభావంతో ఈ వైరస్ విజృంభిస్తుంది.
అయితే, ఈ వైరస్ పేరు గతంలో కూడా అడపాదడపా వినిపించింది. కానీ, అప్పుటిలా ఇప్పుడు లైట్ తీస్కోలేని పరిస్థితి ఉంది. ఒకప్పుడు మంకీ పాక్స్గా పిలిచిన ఈ వైరస్ని ఎమ్ పాక్స్ ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నామకరణం చేసింది. అయితే, ఇప్పటికే వందల మంది చనిపోయారని.. కాబట్టి అన్ని దేశాలు ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆఫ్రికా ఖండం అంతటా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని. ఇది ఇతర ఖండాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నందున హెల్త్ ఎమర్జెన్సీగా పేర్కొంది. ఆఫ్రికాలో 14వేల కంటే ఎక్కువ కేసులు, 524 మరణాలు ఇప్పటివరకు నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే, ఈ లెక్కలు గత సంవత్సర గణాంకాలను కూడా మించిపోయాయని WHO తెలిపింది. ఇప్పటికే ఆఫ్రికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా ఎమ్పాక్స్ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
ఈ పాక్స్ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన నేపథ్యంలో భారత దేశం కూడా అలర్ట్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ వార్డులను సిద్ధం చేయడం నుండి విమానాశ్రయాలను అప్రమత్తం చేయడంతో సహా భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక, ఎవరైనా దద్దుర్లు ఉన్న రోగులను గుర్తిస్తే… ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశించింది. ఢిల్లీలోని మూడు నోడల్ ఆసుపత్రులైన సఫ్దర్జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లు దీని కోసం ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, అనుమానిత రోగులపై RT-PCR, నాజల్ క్లీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలున్నాయి. ఆసుపత్రులతో పాటు ప్రజలు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నిజానికి, ఇటీవల రెండేళ్లలో WHO రెండవ సారి ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎందుకంటే, గతంలో విన్న మంకీ పాక్స్ వైరస్ కొత్త జాతిగా ఈ ఎమ్ పాక్స్ దాని శక్తిని పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇది గతంలో ఎక్కువగా లైంగిక సంపర్కంతో వ్యాపించగా… ఇప్పుడు దీనితో పాటు సాధారణ సన్నిహిత సంపర్కం ద్వారా కూడా సులభంగా వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. అంటే, కరోనా మాదిరి, వ్యాధి సోకిన వారి దగ్గరకు వెళ్లినా ఎమ్ పాక్స్ అటాక్ అవుతున్నట్లు చెబుతున్నారు. అయితే, ఇప్పటివరకు భారత్లో ఈ కొత్త రకం ఎమ్ పాక్స్ కేసులను నమోదు కాలేదు. అయితే, ఆగస్ట్ 16న, పాకిస్తాన్, UAE నుండి ఇండియాకి వచ్చిన ముగ్గురు పాక్స్ రోగులను అధికారులు గుర్తించారు. వారి నుండి వ్యాధి వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: భయపెడుతున్న ఎంపాక్స్ వైరస్.. హైదరాబాద్కు ముప్పు?
అయితే, అంతకుముందు, స్వీడన్, ఆఫ్రికా బయట మొదటి పాక్స్ కేసును నిర్ధారించారు. ఇక, జూన్ 2022 నుండి మే 2023 వరకు 30 పాక్స్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇది ఎక్కువగా విదేశీయుల్లోనే కనిపించినట్లు భారత అధికారులు చెబుతున్నారు. ఇక, ఈ వైరస్లో చివరి జాతితో పోల్చితే ఎమ్ పాక్స్ నుండి మరణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, మశూచి వ్యాక్సిన్లు తీసుకున్న వారికి ఈ వ్యాధి సోకదనీ… ఇంకా వేరే వ్యాక్సిన్ అవసరం లేదని కొందరు అధికారులు అంటున్నారు.
మంకీపాక్స్ అనేది కరోనా వైరస్లా వైరల్ ఇన్ఫెక్షన్తో వచ్చే వ్యాధి. దీనిని మొదటిసారిగా 1958లో కోతులలో గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అనే పేరు పెట్టారు. వ్యాధి ప్రధానంగా , పశ్చిమ ఆఫ్రికాలోని ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలలో కనిపిస్తుంది. తర్వాత కాలంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 80 వేల కంటే ఎక్కువ కేసులు నమోదవ్వగా, 55 మంది మరణించారు. ఇప్పటికే సుమారు110 దేశాలు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు WHO తెలిపింది. 2022లో ఈ మంకీపాక్స్ను WHO ఎమ్ పాక్స్గా పేరు మార్చింది. ఎలుకలు, మానవులకు కూడా ఇది సోకుతుండడంతో పేరును మార్చారు. ఇది జంతువులను, మానవులను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఆర్తోపాక్స్ వైరస్ జాతికి చెందినదిగా పరిశోధకులు గుర్తించారు.
ఈ వైరస్ సోకినవారి చర్మంపై గడ్డలు, పొక్కులు ఏర్పడి అవి దురదను కలిగిస్తాయి. ఈ గడ్డలు రసి, చీముతో నిండి ఉంటాయి. ఈ వైరస్ సోకిన జంతువు లేదా వ్యక్తితో సన్నిహత సంబంధం ఉన్నప్పుడు ఈ వైరస్ ఎదుటు వ్యక్తికి వ్యాప్తిచెందుతుంది. జంతువుల నుంచి కాటు, గీత, రక్తం, ద్రవాలు, ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇది వ్యాపిస్తుంది. మనుషులకు కూడా ఇదే తరహాలో నేరుగా వ్యాపిస్తుంది. అయితే పాక్స్ సోకిన వ్యక్తి వినియోగించిన పరుపు, దుస్తులు, ఇతర వస్తువుల ద్వారా తక్కువ వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక, ఈ వ్యాధి సోకిన వారికి తలనొప్పి, జ్వరం, బాడీ పెయిన్స్తో పాటు ముఖం, చేతులు, పాదాలు, శరీరంలోని ఇతర భాగాలపై దద్దుర్లు, గడ్డలు వస్తాయి. చీముతో కూడా మొటిమలు ఏర్పడతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. లేదంటే ఇది ప్రాణాంతకమవుతుంది. వైరస్ సోకిన రెండు నుంచి నాలుగు వారాల వరకు ఇది ఉంటుంది. లక్షణాలు ఎక్కువ కావడానికి మూడు నుంచి 21 రోజులు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక, దద్దుర్లలోని ద్రవాలను టెస్ట్ చేసి ఈ వైరస్ను గుర్తిస్తారు. అయితే, తేలికపాటి లక్షణాలు ఉంటే త్వరగా తగ్గించుకోవచ్చని అంటున్నారు. ముందుగా చెప్పినట్లు, ఈ వైరస్కి ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్లు లేవు. ప్రస్తుతం ఈ వ్యాధికి యాంటీవైరల్ డ్రగ్ టెకోవిరిమాట్ కోసం అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సరైన చికిత్స, వ్యాక్సిన్లు లేకపోవడం వల్ల ఆఫ్రికా దేశాలు దాటి వైరస్ వ్యాపిస్తే ప్రమాదం తప్పదనే ఆలోచనలో WHO హెల్త్ ఎమర్జెన్సీని దేశాలన్నీ సీరియస్గానే తీసుకుంటున్నాయి.