కేంద్రంపై విపక్ష కూటమి లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై ప్రధాని మోదీ స్పందించారు. విపక్షాలపై సెటైర్లు వేశారు. అది కేంద్రంపై తీసుకొచ్చిన అవిశ్వాసం కాదన్నారు. విపక్ష పార్టీలు వాళ్లపై వాళ్లకే నమ్మకం లేక అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని విమర్శించారు. 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై సిక్స్ కొట్టాలని బీజేపీ ఎంపీలకు సూచించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
అవిశ్వాస తీర్మానం అంశంపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ భేటీలో మోదీ విపక్షాలపై ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీ సర్వీసుల బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ను కొందరు విపక్ష నేతలు 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ బిల్లు ఆమోదం పొందిందని తెలిపారు. ఈ విజయంపై పార్టీ ఎంపీలకు అభినందనలు తెలిపారు.
ప్రతిపక్షాల కూటమిలోని పార్టీల మధ్య పరస్పర విశ్వాసం సన్నగిల్లిందని మోదీ విమర్శించారు. అందుకే ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. కూటమిలోని పార్టీల వైఖరిని పరీక్షించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. ఇది కేంద్రంపై తీసుకొచ్చిన అవిశ్వాసం కాదని స్పష్టం చేశారు.
అవిశ్వాసంపై అధికార పక్షం వ్యూహంపై మోదీ చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను ప్రతిపక్షాలపై అవకాశంగా భావించాలని బీజేపీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికలకు ముందు చివరి బంతికి ‘సిక్స్’ కొట్టాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.