Modi France visit schedule(Today news paper telugu): ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులపాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. ఆ దేశ రాజధాని పారిస్ లో జులై 14న జరిగే బాస్టిల్ డే పరేడ్ కు మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. ఈ కవాతులో భారత త్రివిధ దళాల బృందం పాల్గొంటుంది. బాస్టిల్ డే కవాతులో పాల్గొనేందుకు 269 మంది సభ్యుల త్రివిధ దళ బృందం, సీ–17 గ్లోబ్మాస్టర్ యుద్ధసరుకు రవాణా విమానంలో పారిస్కు చేరుకుంది. ఛాంప్స్ ఎలీసెస్ చారిత్రక ప్రాంత గగనతలంలో ఫ్రెంచ్ యుద్ధవిమానాలతోపాటు భారత రాఫెల్ ఫైటర్జెట్లు ఫ్లైపాస్ట్లో పాల్గొంటాయి.
ఇది ప్రధానిగా మోదీకి ఐదోసారి ఫ్రాన్స్ పర్యటన. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్ ప్రధాని మోదీకి ప్రత్యేక విందు ఇస్తారు. మోదీ, మాక్రాన్ విద్య, ఆర్థిక, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే ఫ్రాన్స్ సెనేట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులను భారత్ ప్రధాని కలుస్తారు. అక్కడ భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలు, భారతీయ సీఈవోలను కలుస్తారు.
ఇండియా–ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న వేళ ప్రధాని మోదీ పర్యటన ఇరుదేశాల భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందని భారత విదేశాంగశాఖ తెలిపింది. నేవీ వేరియంట్ 26 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు, ఇరుదేశాలు కలిసి విమాన ఇంజిన్ను భారత్లో తయారు చేసే ఒప్పందం కుదురుతుందని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా తెలిపారు.
ఫ్రాన్స్ పర్యటన తర్వాత జులై 15న ప్రధాని మోదీ యూఏఈలో పర్యటిస్తారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్తో భేటీ అవుతారు. ఇంధనం, ఆహార భద్రత, రక్షణ, ఫిన్టెక్, విద్య, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తారు. కాప్-28కు యూఏఈ, జీ-20కి భారత్ సారథ్యం వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలపైనా చర్చలు జరుపుతారు.