Modi : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ కీలక విషయాలు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజే ఆర్థిక ప్రపంచంలోని విశ్వసనీయ వర్గాల నుంచి సానుకూల సందేశాలు వెలువడ్డాయని తెలిపారు. ఆర్థిక అనిశ్చితుల వేళ ప్రపంచం మొత్తం భారత్ బడ్జెట్ వైపు చూస్తోందన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభల తొలి ప్రసంగం మహిళలకు గర్వకారణంగా నిలుస్తోందన్నారు. ఈ అవకాశం భారత రాజ్యాంగం ఇచ్చే గౌరవంగా పేర్కొన్నారు. ఆదివాసీలకు, మహిళలకు ఇచ్చే గౌరవమని చెప్పారు.
దేశ ఆర్థికమంత్రి కూడా మహిళే అని గుర్తు చేశారు.
పార్లమెంట్ సమావేశాలల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నానని మోదీ స్పష్టం చేశారు. సమావేశాలు
సజావుగా జరిగేందుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కోరారు. విపక్షాలు తమ అభిప్రాయాల్ని సభలో వ్యక్తపరచాలని సూచించారు. బడ్జెట్ పైనా ప్రధాని మోదీ ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నానని తెలిపారు. ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్ సూత్రాన్ని ముందుకు తీసుకువెళతామని మోదీ స్పష్టం చేశారు.
మోదీ చెప్పిన అంశాలను పరిశీలిస్తే బడ్జెట్ లో ఆత్మనిర్భర్ భారత్ కు పెద్దపీట వేస్తారని అర్థమవుతోంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉంటుందన్నారు. అంటే వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మధ్యతరగతి, పేదలను దృష్టి పెట్టుకుని బడ్జెట్ రూపొందించారని స్పష్టమవుతోంది. సామాన్యులపై భారీగా వరాలు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వేతన జీవులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న విధంగా పన్నులు స్లాబులు మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
మరి అన్నివర్గాల ప్రజలు సంతృప్తి చెందేలా బడ్జెట్ ఉంటుందా? కార్పొరేట్ కంపెనీలకే మోదీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చుతుందని పదేపదే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ప్రతిపక్షాలు విమర్శలను తిప్పికొట్టే చర్యలు మోదీ ప్రభుత్వం చేపట్టిందా? ఆ దిశగా బడ్జెట్ లో సామాన్యుల అవసరాలకు, అవకాశాలకు పెద్దపీట వేశారా? చూడాలి మరి.