Modi On Terror Funding : ఢిల్లీలో ‘నో మనీ ఫర్ టెర్రర్’ అనే అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సభలో అనేక దేశాలకు చెందిన మంత్రులు, ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ సభ్యులు పాల్గొంటున్నారు. ఉగ్రవారంపై పోరాడే ప్రముఖ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని, ఉగ్రదాడులను ఉపేక్షించేది లేదని అన్నారు. వాళ్లను వెంబడించి మరీ మట్టుబెట్టాలని పిలుపునిచ్చారు.
ఉగ్రవాదులు నిధులు సమకూర్చుకోవడానికి కొత్త ఆర్ధిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారని చెప్పారు. వేలాది ప్రాణాలు పోయినా ఉగ్రవాదాన్ని దృఢంగా ఎదుర్కొంటున్నామని అన్నారు. ఉగ్రవాదుల నెట్వర్క్లను, ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టాలన్నారు.
కొన్ని దేశాలు పరోక్షంగా ఉగ్రవాదులుకు నిధులు, ఆయుధాలు సమకూర్చి పెడుతున్నాయని.. అలాంటి దేశాలపై ఆర్ధిక ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకు భారత్ విశ్రమించబోదని అన్నారు. ఇప్పటివరకు భారత్ ఏ ఒక్క ఉగ్రవాదిని కూడా భారత్ తక్కువ అంచనా వేయలేదన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలన్నారు.