Modi to take oath as PM for June 8th(Telugu flash news): ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయా? ఫలితాలు తర్వాత నరేంద్రమోదీ కంగారు పడుతున్నారా? ఏ మాత్రం రెస్ట్ లేకుండా ఎన్డీయే మిత్రులను ఎకాఎకీన హస్తినకు రావాలని ఎందుకు కబురుపెట్టారు? బీజేపీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయా? లేక ఎన్డీయేలో విభేదాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఇవే ప్రశ్నలు రాజకీయ నేతలను వెంటాడుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టింది ఎన్డీయే కూటమి. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దవుతున్నారు నరేంద్రమోదీ. ఇందులోభాగంగానే జూన్ 8న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్డీయే మిత్రులను హస్తినకు రావాలని కబురుపెట్టారు. మిత్రులంతా అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ మీటింగ్లో వెనుక కీలక అంశాలు కొన్ని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్డీయేలో ఏ ఒక్కరూ బయటకు వెళ్లకుండా చూడాలన్నదే ఈ మీటింగ్ ఉద్దేశంగా తెలుస్తోంది. కేబినెట్ బెర్త్ల విషయంపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో వార్తలు జోరందుకున్నాయి. వచ్చిన సీట్లు ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని మంత్రుల పదవులు ఇవ్వాలనేది ఇందులోని కీలకాంశం. ఈ మీటింగ్లో బెర్తుల అంశం కొలిక్కి వచ్చిన తర్వాత అప్పుడు పార్టీ నుంచి కేబినెట్లోకి ఎవరెవర్ని తీసుకోవాలన్నది మోదీ-అమిత్ షా కలిసి డిసైడ్ చేయనున్నారట.
కాకపోతే ఈసారి బీజేపీలోని చాలామంది సీనియర్లు తన ఒపీనియన్ని బయటపెడుతున్నారు. ప్రధానిగా మోదీ రెండుసార్లు చేశారని, ఈసారి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అయితే బాగుంటుందని అంటున్నారట. ఈ క్రమంలో కొంతమంది సీనియర్లు ఓ గ్రూప్గా ఏర్పడినట్టు వార్తలు జోరందుకున్నాయి. ప్రమాణ స్వీకారానికి నరేంద్రమోదీ కంగారుపడటానికి ఇదే కారణమని అంటున్నారు. కేబినెట్ కొలువుదీరిన తర్వాత సమస్యలు చక్కదిద్దాలని భావిస్తున్నారట.
ALSO READ: ఒకే విమానంలో నితీశ్, తేజస్వి..ఎందుకో తెలుసా?
మరోవైపు ఇండియా కూటమి సమావేశం ఇవాళ, రేపో జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నేతలు ఢిల్లీ బాటపట్టారు. తమకు పరిచయాలున్న ఎన్డీయేలోని ముఖ్యమైన నాయకులతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే మీటింగ్లో వారికి సానుకూలంగా లేకుంటే ఇండియా కూటమిలోకి రావడం ఖాయమని అంటున్నారు. దశాబ్దంపాటు దేశాన్ని పాలించిన నరేంద్రమోదీకి ఈసారి కష్టాలు తప్పవన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా.. ప్రధాని పదవికి నరేంద్రమోదీ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంతవరకూ ప్రధానిగా కొనసాగాలని ద్రౌపది ముర్ము మోదీని కోరారు. ఎన్డీయే కూటమికి తక్కువ సీట్లు రావడంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ సిఫార్సులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 17వ లోక్ సభను రద్దు చేశారు.