Ayodhya : ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన రైల్వేస్టేషన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఉదయం అయోధ్య చేరుకోగానే ఎయిర్ పోర్టులో మోదీకి రాష్ట్ర గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి రోడ్ షో చేపట్టారు. రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్లు ఈ రోడ్ షో సాగింది. దారి పొడవునా మోదీకి ప్రజలు ఘనం స్వాగతం చెప్పారు. అదే సమయంలో 1,400 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.
అయోధ్యలో రైల్వేస్టేషన్ తోపాటు 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందేభారత్ రైళ్లను మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నారు.అంతకుముందు అమృత్ భారత్ రైల్లో విద్యార్థులతో కొంతసేపు ప్రధాని ముచ్చటించారు. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ ఎయిర్ పోర్టును ప్రారంభిస్తారు.
ముందూ వెనుక ఇంజిన్లు ఉండే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ పుష్-పుల్ రైలు. తక్కువ సమయంలోనే ఈ రైలు వేగాన్ని అందుకుంటుంది. ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇందులో 22 కోచ్లు ఉంటాయి. 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్ కోచ్ లు, 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నాయి. రెండు గార్డు కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో మహిళలకు, దివ్యాంగులకు కొన్నిసీట్లు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైళ్లు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.