Modi : పార్లమెంట్ లో చర్చలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని ప్రతిపక్షాలను కోరారు. సభలో కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశాలు కల్పించాలని సూచించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.
ఈ ఏడాది ఆగస్టు 15తో స్వతంత్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయ్యాయని మోదీ అన్నారు. ఇక మనముందు ఉన్నది ఆజాదీకా అమృత్ కాల్ అని తెలిపారు. జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తున్న వేళ.. ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని వివరించారు. అంతర్జాతీయంగా భారత్ పై అంచనాలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచ వేదికలపై మన భాగస్వామ్యం పెరుగుతోందన్నారు. ఇప్పుడు జీ-20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం లభించిందని తెలిపారు. ఇది మన సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించేందుకు వచ్చిన అద్భుత అవకాశమని మోదీ పేర్కొన్నారు.
దేశ అభివృద్ధి కోసం ఈ పార్లమెంట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నాలు జరగాలని మోదీ ఆకాంక్షించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ఈ చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఎంపీలు, యువ సభ్యులకు చర్చల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీల నేతలకు సూచించారు. ప్రజాస్వామ్య దేశంలో మరో తరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సభలో ఆటంకం కలిగితే కొత్త ఎంపీలు మాట్లాడేందుకు అవకాశం ఉండదన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. మొత్తం 17 రోజులపాటు సమావేశాలు జరుగుతాయి.