Divya Pahuja : ఓ గ్యంగ్ స్టర్ ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో నిందితురాలైన మాజీ మోడల్ దివ్య పహుజా గుర్గావ్ లోని ఓ హోటల్లో హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 27 ఏళ్ల యువతిని ఐదుగురు వ్యక్తులు హోటల్ గదికి తీసుకెళ్లారు. గదిలో ఆమెని తుపాకీతో కాల్చి చంపారు.
హంతకులు తన మృతదేహాన్ని హోటల్ నుండి కారులోకి లాగుతున్నట్లు సీసీటీవీలో రికార్డయింది. పోలీసులు ఫుటేజీ ద్వారా ఐదుగురు నిందితులలో ముగ్గురిని గుర్తించి, హోటల్ యజమాని అభిజీత్ సింగ్ తో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మోడల్ మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన BMW కారును స్వాధీనం చేసుకున్నారు. తన అభ్యంతరకర ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నందువల్లే దివ్యను కాల్చి చంపానని అభిజీత్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే దివ్య పహుజా మృతదేహం మాత్రం ఇంకా పోలీసులకు లభ్యంకాలేదు.
హోటల్లోని కారిడార్లో ఇద్దరు వ్యక్తులు పహుజా మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి లాగినట్లు హోటల్ నుండి రికవరీ చేయబడిన సీసీటీనీ ఫుటేజీ ద్వారా తెలిసింది. అభిజీత్ సింగ్కు చెందిన నీలిరంగు BMW కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి పారవేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో ప్రధాన నిందితుడైన అభిజీత్ సింగ్ మృతదేహంతో ఉన్న కారును హోటల్కు కిలోమీటరు దూరంలో ఉన్న బాల్రాజ్ గిల్ అలియాస్ హేమరాజ్ (28)కి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
పంజాబ్లోని పాటియాలాలోని బస్టాండ్లో గుర్గావ్ పోలీసులు BMW కారును గుర్తించారు. కానీ మాజీ మోడల్ మృతదేహం కారులో కనిపించలేదు. పోలీసులు దివ్య పహుజా మృతదేహాన్ని ఎక్కడ పడవేశారనే దానిపై అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను విచారిస్తున్నారు. దివ్య పహుజా 2016లో.. అప్పటి తన ప్రియుడు గురుగ్రామ్ గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ఫేక్ ఎన్కౌంటర్లో ఆమె హస్తం ఉందన్న ఆరోపణలతో జైలుకెళ్లింది. గత ఏడాది జూన్లో దివ్యకు బెయిల్ మంజూరైంది.