Kavitha: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ నోటీసులిచ్చింది. అయితే గురువారమే కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. దీక్ష ఉండడంతో 11న వస్తారని కోరారు. అందుకు ఈడీ అంగీకరించడంతో శనివారం భర్త అనిల్ కుమార్, న్యాయవాది మోహన్రావుతో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు.
కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో ఆమెకు నైతిక మద్ధతు తెలిపేందుకు బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు భారీగా సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్లతో సహా పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఇక విచారణ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బారీకేడ్లను ఏర్పాటు చేసి ఈడీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు.
ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లైలతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇక ఇవాళ్టి విచారణలో కవితతో పాటు 9 మందిని ఒకసారి ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. కవితతో పాటు మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, బుచ్చిబాబు, మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరవింద్లను ఒకేసారి విచారించనున్నట్లు సమాచారం.