Chandrayaan 3 live today(Latest breaking news in telugu): యావత్ భారతీయుల ఆశలు మోసుకెళుతూ చంద్రయాన్ 3 నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా నిర్దేశిత సమయానికి.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు.. నిప్పులు విరజిమ్ముతూ.. రివ్వున ఆకాశానికి ఎగిసింది. చందమామపై చెరగని సంతకం చేసేందుకు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించింది.
చంద్రయాన్ 3 ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తి నెలకొంది. ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్తో కూడిన చంద్రయాన్-3ని ఇస్రో నింగిలోకి పంపింది. భూమి చుట్టూ ఉన్న 170X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో చంద్రయాన్-3ను రాకెట్ ప్రవేశపెట్టింది. చంద్రయాన్ 24 రోజుల పాటు భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ ప్రక్రియను ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్స్ అంటారు.
చంద్రుడి దిశగా లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్-3ను పంపిస్తారు. ఆ తర్వాత చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఆ దశలో ఇంజిన్ను మండించి చంద్రయాన్-3 వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా దాన్ని చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ఒడిసిపడుతుంది. అప్పటి నుంచి చందమామ కక్ష్యలో తిరుగుతుంది.
చివరిగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చంద్రయాన్ ను ప్రవేశపెడతారు. ఆగస్టు 23 కానీ 24న కానీ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. ఆ మాడ్యూల్ గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలం దిశగా వెళుతుంది. అప్పుడు 4 ఇంజన్ల సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్ దిగుతుంది.
చంద్రుడి తాకే సమయంలో ల్యాండర్ వేగం సెకనుకు 2 మీటర్లు, హారిజాంటల్ వేగం సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. వాలు.. 120 డిగ్రీలను మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా చంద్రయాన్ ప్రయోగం సాగుతుంది.
ఆగస్టు 23 లేదా 24వతేదీ నాటికి చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 ల్యాండ్ కానుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై ఒక అంతరిక్ష నౌక ల్యాండ్ కావడం ఇదే తొలిసారి కానుంది. చంద్రుడి ఉత్తర ధృవం కన్నా దక్షిణ ధృవం విశాలంగా ఉంటుందని, అందువల్ల ఆ ప్రాంతంలో ల్యాండ్ చేయాలని నిర్ణయించామని ఇస్రో తెలిపింది. ఆ ప్రాంతంలో నీటి జాడలు లభించే అవకాశం ఉండడం ఇక్కడ ల్యాండ్ చేయడానికి మరో కారణమని తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయిన తరువాత, ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో ఉన్న రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపై ఆ రోవర్ దాదాపు 14 రోజుల పాటు తిరుగుతుంది. అందులోని కెమెరాలు వివిధ కోణాల్లో చంద్రుడి ఉపరితలాన్ని ఫొటోలు తీసి, భూమికి పంపిస్తాయి.
చంద్రుడి ఉపరితలంపై టెంపరేచర్, థర్మల్ కండక్టివిటీని మెజర్ చేయడానికి ల్యాండర్ పేలోడ్ లో థర్మోఫిజికల్ ఎక్స్ పెరిమెంట్ వంటి పేలోడ్లను అమర్చారు. అలాగే ప్లాస్మా సాంద్రత, దాని రకాలను అధ్యయనం చేయడానికి ల్యాంగ్ మిర్ ప్రోబ్ పరికరాలను కూడా ల్యాండర్లో ఫిక్స్ చేశారు. ఇక రోవర్ పేలోడ్లో ఆల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇన్డ్యుస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపీ అనే పరికరాలు ఇందులో ఏర్పాటు చేశారు.
చంద్రయాన్ త్రి బరువు 3 వేల 900 కిలోలు. మొత్తం రాకెట్ బరువు 642 టన్నులు. చంద్రయాన్ త్రి స్పేస్ క్రాఫ్ట్ 40 రోజులు ప్రయాణించనుంది. అయితే జాబిల్లిపై రోవర్ ల్యాండ్ కావడం అనేది అనేక సవాళ్లతో కూడుకున్నది. చంద్రుని ఉపరితలంపై మృదువైన ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తారు. ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైతే.. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనతను సాధించాయి.
గతంలో చంద్రయాన్ టూలో ఇదే విధంగా జాబిల్లి జాడను తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఇస్రో చివరి నిమిషంలో విఫలమైంది. ల్యాండర్ చంద్రుని ఉపరితలంలో దిగే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. భూమి నుంచి సంకేతాలు తెగిపోవడంతో చంద్రుని ఉపరితలాన్ని ఢీ కొనడంతో ప్రయోగం విఫలమైంది. దీంతో చంద్రుని ఉపరితలంపై ఆశించిన పరిశోధనలు ఇస్రో చేయలేకపోయింది. ఈ ఫెయిల్యూర్ను విశ్లేషించుకున్న సైంటిస్టులు.. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ సురక్షితంగా దిగే విధంగా సరికొత్త విధానాన్ని రూపొందించింది. ఓటమి విజయానికి నాంది అంటారు. గతంలో ఒకసారి సగం ఓటమి పొందిన ఇస్రో.. ఈ సారి డబుల్ విక్టరీ కొడుతుందని ఆశిద్దాం.