Mayawati : 2024 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల అనంతరం పొత్తును ఆమె తోసిపుచ్చలేదు. ఉత్తరప్రదేశ్కు 18వ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతికి సోమవారం, జనవరి 15తో 68 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
బీఎస్పీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, అయితే ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ మరొక పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడల్లా, ఓట్లు కూటమికి బదిలీ అవుతున్నాయని.. దీంతో లాభం కంటే తమకు నష్టమే ఎక్కువగా జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.
“ఉత్తర్ ప్రదేశ్ లో పొత్తులు పెట్టుకోవడం ద్వారా బీఎస్పీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది, పొత్తు వలన ఓట్లు స్పష్టంగా కూటమి భాగస్వామికి బదిలీ అవుతున్నాయి, కానీ రివర్స్ ఎప్పుడూ జరగలేదు” అని మాయావతి అన్నారు. ఎన్నికల అనంతర పరిస్థితిని బేరీజు వేసుకున్న తర్వాత ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాలనే విషయంపై పార్టీ ఆలోచిస్తుందని తెలిపారు.
గతంలో జరిగిన ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్తో బీఎస్పీ పొత్తులు పెట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలే లాభపడ్డాయని తెలిపారు.
‘‘ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర రంగాల్లో ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల పరిస్థితి దయనీయంగా ఉంది.. నా జీవితమంతా వారి శ్రేయస్సుకే అంకితం చేశాను. చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటాను. వెనుకబడిన వారి కోసం పని చేస్తున్నాను” అని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా మాయావతి బీజేపీపై విమర్శలు గుప్పించారు. కులతత్వ, మతతత్వ రాజకీయాలు చేస్తారని.. ప్రజలు బీజేపీని అధికారంలో చూడాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, ద్వేషం రూపంలో ప్రజలకు అనేక కష్టాలను మోడీ ప్రభుత్వం కలిగించిందని ఆమె అన్నారు. ఉపాధి మార్గాలకు బదులు తక్కువ మొత్తంలో ఉచిత రేషన్ ఇస్తూ ప్రజలను ఆశ్రితులుగా మార్చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో జరిగే ‘ప్రాణ్ప్రతిష్ఠ’ కార్యక్రమ ఆహ్వానంపై మాయావతి స్పందించారు. “నన్ను ఆహ్వానించారు, కానీ నేను పార్టీ పనిలో బిజీగా ఉన్నందున ఇంకా వెళ్లాలని నిర్ణయించుకోలేదు. ప్రణాళికాబద్ధమైన ఏ కార్యక్రమంపైనా మాకు అభ్యంతరం లేదు, మేము దానిని స్వాగతిస్తున్నాము.” అని ఆమె చెప్పారు
“బాబ్రీ మసీదుకు సంబంధించి ఏదైనా సంఘటన జరిగితే, మేము దానిని కూడా స్వాగతిస్తాము, బీఎస్పీ ఒక లౌకిక పార్టీ.. మేము ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాము, మేము అన్ని మతాలను గౌరవిస్తాము. నాకు అందిన ఆహ్వానాన్ని నేను స్వాగతిస్తున్నాను” అని బీఎస్పీ అగ్రనేత స్పష్టం చేశారు.