Massive Encounter in Maharashtra: మహారాష్ట్రలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్ గఢ్- మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మావోయిస్టులు విధ్వంసాలు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో నిఘావర్గాలు అలర్ట్ అయ్యాయి.
ఈ మేరకు ఛత్తీస్ గఢ్ కాంకేర్, మహారష్ట్ర గడ్చిరోలి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భామరగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతానికి సమీపంలో సీఆర్ఫీఎఫ్ 2 క్యూఏటీ బలగాలు, సీ60కి చెందిన 22 యూనిట్లు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సమయంలో కోపరీ అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సమయంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఈ ఘటనలో ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో నాగ్ పూర్ ఆస్పత్రికి తరలించారు. ఇక మావోయిస్టుల మృతదేహాలను మరో హెలికాప్టర్లో గడ్చిరోలికి తీసుకొచ్చారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో భారీగా పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు, ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లలో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లోన్ వరాటు కార్యక్రమంలో లొంగి పోయారు. కాగా, ఇద్దరు మావోయిస్టులు నందు, హాద్మాలపై రూ.2లక్షల రివార్డు ప్రకటించగా.. లొంగిపోయిన మావోయిస్టులలో నందు మాద్వితోపాటు హిద్మా మాద్వి, హేమ్లా ఉన్నట్లు తెలిపారు.
Also Read: డీజీపీకి చేతులు ఎత్తి మొక్కిన సీఎం, ప్రతి నమస్కారం పెట్టిన పోలీస్ బాస్, కారణం ఇదే
ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా వరుసగా ఎన్ కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది మావోయిస్టులను మట్టి కరిపించారు. ఈనెల ప్రారంభంలో దండకారణ్యంలో భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ తో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు ఈ ఎన్ కౌంటర్ లో 40 మంది మావోయిస్టులను హతమార్చారు.