Marriage: ఓ వైపు ఘనంగా పెళ్లి.. మరోవైపు బంధుమిత్రులతో కోలాహలం. పంతులు వేధమంత్రాలతో పెళ్లి జరిపిస్తున్నాడు. మరికొన్ని నిమిషాల్లో వరుడు వధువు మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. కల్యాణ మండపం అంతా సందడి వాతావరణం నెలకొంది. కానీ పెళ్లి కొడుకు మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా తన పనిలో తాను ఉన్నాడు. పంతులు మంత్రాలు చదవుతున్నా పట్టించుకోకుండా.. ఫుల్గా మద్యం తాగి గాఢనిద్రలోకి జారుకున్నాడు. మండపంపైనే పక్కేసుకొని పడుకున్నాడు. దీంతో పెళ్లికూతురుకు కోపం వచ్చింది. మండపంపై నుంచి లేచి వెళ్లిపోయింది.
అస్సాంలోని నల్బరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. హలోయ్ అనే యువకుడికి ఇటీవల ఓ యువతితో పెళ్లి కుదరగా.. పెద్దలు ఘనంగా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే హలోయ్ ఫుల్గా మద్యం సేవించి కల్యాణ మండపానికి చేరుకున్నాడు. ఒక్క వరుడే కాదు ఫ్యామిలీ మొత్తం అలానే మద్యం సేవించి వచ్చారు. అది చూసిన పెళ్లి కూతురు అప్పటికే తాను ఈ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. అయితే పెద్దలు నచ్చజెప్పడంతో కల్యాణ మండపంపైకి వెళ్లి హలోయ్ పక్కన కూర్చుంది.
పంతులు వేదమంత్రాలు చదువుతుండగా.. పెళ్లికొడుకు గాఢనిద్రలోకి జారుకున్నాడు. అతడిని లేపినా కూడా లేవలేదు. దీంతో పెళ్లికూతురుకు కోపం వచ్చి మండపం పైనుంచి లేచి వెళ్లిపోయింది. పెళ్లి కొడుకు, వారి కుటుంబ సభ్యుల ప్రవర్తనపై పెళ్లికూతురు తరుపు వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పెళ్లికొడుకును అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.