Marriage: హార్ట్ ఎటాక్.. ఈ మధ్యలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. అప్పటి వరకు అందరితో కలిసి మెలిసి ఉండి ఒక్కసారి కుప్పకూలిపోతున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇలానే ఓ మరికొద్దిగంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన నవవధువు గుండెపోటుతో కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు ప్రాణాలు కోల్పోయింది.
గుజరాత్లోని భావ్నగర్ జిల్లాకు చెందిన విశాల్భాయ్, హేతల్ల వివాహం గురువారం జరగాల్సి ఉంది. పెద్దలు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఇరువురి ఇళ్లలో బందుమిత్రులు, సన్నిహితులతో పెళ్లి సందడి మొదలైంది. విశాల్ భారీ ఊరేగింపుగా గురువారం ఉదయం హేతల్ ఇంటికి చేరుకున్నాడు.
ఇంతలోనే ఓ విశాద ఘటన చోటుచేసుకుంది. హేతల్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కన్నీరుమున్నీరు అయిన తల్లిదండ్రులు.. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు.
హేతల్ స్థానంలో ఆమె చెల్లెలిని ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు విశాల్, అతని తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో అదే పెళ్లి మండపంలో వారికి వివాహం జరిపించారు. ఆనంతరం మార్చురీలో భద్రపరిచిన హేతల్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.