Haryana CM Manohar Lal Khattar Resign: హర్యానాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. సరిగ్గా లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ – జేజేపీ కూటమిలో విభేదాలు తెరపైకి వచ్చాయి. లోక్ సభ సీట్లపై పొత్తు కుదరకపోవడంతో మిత్రపక్షమైన జేజేపీ.. బీజేపీతో పొత్తు తెంచుకుంది. రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో.. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ దత్తాత్రేయకు పంపారు. సీఎంతో పాటు మంత్రి మండలి సభ్యులు కూడా తమ రాజీనామా లేఖలను సమర్పించారు.
Also Read: దేశంలో ముస్లిం పౌరులపై CAA ప్రభావం ఉంటుందా ? ముస్లింలకు మాత్రమే ఇది ఎందుకు వర్తించదు ?
సీఎం, మంత్రి మండలి రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో అక్కడి కేబినెట్ రద్దయింది. ఈ రోజు మధ్యాహ్నమే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. కొద్దిసేపటిలో బీజేఎల్పీ సమావేశం కానుంది. స్వతంత్ర ఎమ్మెల్యేల సపోర్టుతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. సీఎం రేసులో నయబ్ సైనీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరగ్గా.. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లలో గెలిచింది. జేజేపీ 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అప్పట్లో జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. ఆ పార్టీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం పదవిని కట్టబెట్టింది. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 46 మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు కావలసి ఉంటుంది. 40 మంది ఎమ్మెల్యేలతో ఉన్న బీజేపీ.. మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.