Mann Ki Bath : చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్లాండ్, అమెరికా సహా పలు ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు చాలామంది వెకేషన్కు వెళ్తుంటారని, కరోనా బారిన పడకుండా వారంతా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతికదూరం వంటి ప్రొటోకాల్స్ను పాటించాలని చెప్పారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా జీరో-కోవిడ్ పాలసీని చైనా ఎత్తివేయడంతో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలతో ముందుకు వెళ్తోందని చెప్పారు.
భారతదేశం 220 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోస్లు ఇవ్వడం ద్వారా ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించిందని మోదీ తెలిపారు. గ్లోబల్ ఎకానమీలో ఐదో స్థానంలో నిలిచిందని ప్రధాని అన్నారు. ఎగుమతుల విషయంలోనూ 400 బిలియన్ డాలర్ల విలువచేసే మేజికల్ ఫిగర్ను సాధించిందని చెప్పారు. అంతరిక్ష, రక్షణ, డ్రోన్ రంగాల్లో కొత్త పుంతలు తొక్కిందని, క్రీడల్లోనూ విజయాలను సొంతం చేసుకున్నామని అన్నారు.
75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాలతో అమృత్ కాల్ మొదలైందన్నారు ప్రధాని. దేశం శీఘ్రగతిన పురోగతిన సాధించి ప్రపంచంలోనే అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఆరోగ్యరంగంలో అనేక సవాళ్లను అధిగమించామని, ఆటలమ్మ, పోలియా వంటి వ్యాధులను నిర్మూలించామని చెప్పారు. కాలా అజర్ వ్యాధిని తరిమికొట్టామని … ఇప్పుడు ఆ వ్యాధి బీహార్, జార్ఖండ్లోని నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైందని ప్రధాని మన్కీ బాత్లో చెప్పారు.