Manish Sisodia: ఢిల్లి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాను ఆదివారం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తన అరెస్ట్ను సవాల్ చేస్తూ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సీబీఐ ఛార్జ్షీట్లో మనిశ్ సిసోడియా పేరు లేకున్నా అక్రమంగా అరెస్ట్ చేశారని సిసోడియా తరుపున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు సీబీఐ అరెస్టును సవాల్ చేయాలనుకుంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలి సూచించింది.
ఆదివారం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. సిసోడియాను ఐదురోజుల సీబీఐ కస్టడీకి ఇస్తూ ఢిల్లీ కోర్టు సోమవారం ఉత్తర్వులిచ్చింది. సిసోడియా కస్టడీపై ఢిల్లీ కోర్టు కొన్ని షరతులు విధించింది. ఐదురోజుల కస్టడీలో సిసోడియాను విచారించే చోట సీసీటీవీ ఉండాలని స్పష్టం చేసింది. ఆ ఫుటేజ్ను సీబీఐ భద్రపరచాలని ఆదేశాలిచ్చింది. సిసోడియాకు 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించింది. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఒక అరగంటపాటు తన తరఫు న్యాయవాదులను కలుసుకునే అవకాశం కల్పించాలని సూచించింది.
వారిమధ్య జరిగే సంభాషణను దర్యాప్తు సంస్థ అధికారులు వినకూడదని స్పష్టం చేసింది. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు ఆయన సతీమణితో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వైద్యులు సూచించిన మందులు వేసుకునేందుకు సిసోడియాకు పర్మిషన్ ఇవ్వాలని సూచించింది. అయితే తన అరెస్ట్ను, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తున్న తీరును సవాల్ చేస్తూ మనీశ్ సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.