Kharge : ప్రధాని మోదీ ఢిల్లీ ఎర్రకోటపై చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఏడాది మళ్లీ ఆగస్టు 15న వస్తానని చెప్పడంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. వచ్చే ఏడాది ఆయన ఇంటిపైనే జెండా ఎగురవేస్తారని చెప్పారు. గెలిచిన వాళ్లు మళ్లీ తమదే విజయమని చెబుతుంటారని కానీ జయాపజయాలు నిర్ణయించేది ప్రజలు మాత్రమేనని స్పష్టంచేశారు. 2024లో జాతీయ పతాకాన్ని మళ్లీ ఎగరవేస్తానని చెప్పడం మోదీ గర్వాన్ని సూచిస్తోందని విమర్శించారు. ఇండిపెండెన్స్ డే నాడు కూడా ప్రతిపక్షాలపై కామెంట్లు చేశారన్నారు. దేశాన్ని నిర్మించేదెప్పుడు? అని ఖర్గే నిలదీశారు.
స్వతంత్ర దినోత్సవ కార్యక్రమానికి తాను రాకపోవడానికి కారణాలను ఖర్గే వెల్లడించారు. తాను కంటి సమస్యతో బాధపడుతున్నాని తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం ఉదయం 9.20 గంటలకు తన ఇంటి వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేశానని వివరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించానని చెప్పారు. అందుకే సమయానికి వెళ్లలేకపోయానని వివరించారు. పీఎం మోదీని తప్ప ఎవరినీ భద్రతా దళాలు ముందుకు వెళ్లనీయలేదని ఖర్గే మండిపడ్డారు. దీంతో వేడుక సమయానికి ఎర్రకోట వద్దకు రాలేనని అనుకొన్నానని చెప్పారు. అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని భావించానని ఖర్గే వెల్లడించారు.
ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వేడుకలో ఖర్గే పాల్గొనలేదు. దీంతో ఖర్గే పేరుతో ఉన్న కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది. అయితే ఖర్గే వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశ ప్రగతి కోసం పలువురు మాజీ ప్రధానులు చేసిన సేవలను ఖర్గే గుర్తు చేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ , అటల్ బిహారీ వాజ్పేయీ పేర్లను తన సందేశంలో ప్రస్తావించారు.
ప్రతి ప్రధాని దేశ పురోగతికి తమవంతు కృషి చేశారని ఖర్గే స్పష్టం చేశారు. కానీ గత 9 ఏళ్ల నుంచే దేశం ప్రగతి పథంలో ఉందని మోదీ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని బలహీన పర్చే కుట్ర చేస్తున్నారని ఖర్గే కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు.