Bengaluru: ధోతీ ధరించాడని లోనికి అనుమతించని జీటీ మాల్ విమర్శలపాలైంది. సినిమా టికెట్లు కొనుక్కున్న తర్వాత లోనికి వెళ్లడానికి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు తమ అసంతృప్తి వ్యక్తపరిచారు. ధోతీ ధరిస్తే మాల్లోకి రానివ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ధోతీ ధరించడం మన సంస్కృతి అని, ధోతీ ధరించడానికి లోనికి అనుమతించకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. ఈ ఘటనపై పౌర సమాజం నుంచి వచ్చిన తీవ్ర నిరసనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. సదరు మాల్కు పనిష్మెంట్ ఇచ్చింది.
ఆ జీటీ మాల్ను వారం రోజులు మూసేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి బైరాతి సురేశ్ మాట్లాడుతూ ‘బృహత్ బెంగళూరు మహానగర పాలకేకు చెందిన మాజీ కమిషనర్లను సంప్రదించాం. మాల్ను వారం రోజులపాటు మూసి వేసే నిబంధన ఉన్నదని చెప్పారు. ఆ నిబంధన కింద మాల్ను వారం రోజులపాటు మూసేస్తున్నాం’ అని చెప్పారు.
ఆ మాల్ పై బుధవారం కేసు కూడా ఫైల్ అయింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 126(2) కింద మాల్ యజమాని, సెక్యూరిటీ గార్డులపై కేసు నమోదైంది.
అసలేం జరిగింది?
హవేరి జిల్లా నుంచి బెంగళూరుకు తన కొడుకును చూడటానికి ఫకీరప్ప అనే రైతు వచ్చాడు. కొడుకు తన తండ్రి వచ్చాడని బెంగళూరు చూపించాలనే ఉద్దేశ్యంతో బయటికి తీసుకెళ్లాడు. మాగాడి మెయిన్ రోడ్డులోని జీటీ మాల్లో సినిమాకు టికెట్లు బుక్ చేశాడు. తీరా అక్కడికి వెళ్లాక సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుంది. తన తండ్రి ధోతీ ధరించాడని, మాల్ నిబంధనల ప్రకారం ధోతి ధరించిన వారికి అనుమతి లేదని సెక్యూరిటీ గార్డులు తెగేసి చెప్పారు. అప్పటికే టికెట్లు కొనుక్కున్నామని, లోనికి అనుమతించాలని సెక్యూరిటీ గార్డులకు విజ్ఞప్తి చేయగా ససేమిరా అన్నారు. అవసరమైతే తన తండ్రిని ధోతీకి బదులు ప్యాంట్ వేసుకోవాలని సూచించారు. ప్యాంటు ధరిస్తే లోనికి అనుమతిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాల్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కాగా, ఈ పరిణామంపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వం అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇలాంటి అవమానాలు ఎదురవుతున్నాయని దుయ్యబట్టారు. దీంతో సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుంది.