Shivaji Statue Collapse| మహారాష్ట్రంలో శివాజీ మహరాజ్ విగ్రహం కూలిపోయిన ఘటన రాజకీయ దుమారంగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం 8 నెలలలపు కూలిపోవడంతో విగ్రహం తయారీలో అవినీతి జరిగిందని.. అవినీతి పరులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం, సెప్టెంబర్ 1న ప్రతిపక్ష పార్టీల కూటమి మహావికాస్ అఘాడీ నిరసనగా భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీ నిరసనకు ‘జోడే మారో’ (చెప్పుతో కొట్టు) ఆందోలన్ అని పెట్టారు.
ముంబైలోని ఫోర్ట్ ఏరియా హుతాత్మ చౌక్ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా వరకు ఈ జోడే మారో నిరసన ర్యాలీ జరగుతోంది. నిరసనలో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీని కోసం భారీ సంఖ్యలో సెక్యూరిటీ బలగాలను మోహరించారు. శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో ఉంచుకొని గేట్ ఆఫ్ ఇండియా వద్ద ఆదివారం పర్యాటకులకు అనుమతించ లేదు.
జోడే మారో నిరసనలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద శివాజీ మహరాజ్ ఆశీర్వాదం తీసుకొని మహారాష్ట్ర జాతి గౌరవాన్ని మేల్కొలుపేందుకే ఈ నిరసన చేస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఎన్ సీపీ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా శివాజీ విగ్రహ తయారీలో అవినీతికి పాల్పడిన శివద్రోహులను క్షమించే ప్రసక్తే లేదని అన్నారు. కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోల్ కూడా శివాజీ విగ్రహ తయారీ నిర్లక్ష్యం చేసి ఛత్రపతి శివాజీని అవమానించడానికి ప్రయత్నించిన వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ఈ నిరసన ఉద్దేశమని చెప్పారు.
8 నెలల క్రితం ప్రధాన మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించబడిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత నేవీ, రాష్ట్ర ప్రభుత్వం సంయక్తంగా తయారు చేశాయి. అయితే ఈ విగ్రహం వర్షాల ధాటికి కూలిపోవడంతో విగ్రహతయారీలో అవినీతి జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. విగ్రహ తయారీ లో భాగమైన విగ్రహ స్ట్రక్చరల్ కన్సల్టెంట్, కాంట్రాక్టర్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు ఈ నిరసన ర్యాలీకి కౌంటర్ చేస్తూ ప్రభుత్వం లో భాగమైన బిజేపీ మరో ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ప్రధాన మంత్రి మోదీ కూడా మహారాష్ట్ర ప్రజలకు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడం బాధాకరమని చెబుతూ క్షమాపణలు తెలిపారు.
Also Read: లాప్ టాప్ దొంగతనం చేసిన ‘స్విగ్గీ జీనీ’.. రూ.15 వేలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్!
అయితే ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన జోడే మారో నిరసన ర్యాలీని బిజేపీ తీవ్రంగా విమర్శించింది. గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఏ నాడు ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడలేదని ఇప్పుడు మాత్రం విగ్రహం విషయంలో అనవసరంగా వివాదం చేస్తోందని బిజేపీ నాయకుడు కేశవ్ ఉపాధ్యే మండిపడ్డారు. ప్రతిపక్షా నిరసనకు వ్యతిరేకంగా బిజేపీ ముంబై లోని దాదర్ వద్ద నిరసన చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.