Maharashtra Unveils ‘Ladka Bhau’ Yojana for youth: మహారాష్ట్ర సర్కారు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ఓ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చింది. సీఎం యువ కార్య ప్రశిక్షణ యోజన పేరుతో కొత్త స్కీమ్ను అమలు చేయనున్నది. నిరుద్యోగ యువతకు వారి విద్యార్హతలను బట్టి ప్రతి నెలా వారి బ్యాంకు అకౌంట్లలో స్టయిఫండ్ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 5,500 కోట్లను వెచ్చించనున్నది. ఈ ఏడాది చివరలో మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ స్కీమ్ను తీసుకురావడం గమనార్హం.
18-35 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు ఈ పథకానికి అర్హులు. వారు మహారాష్ట్ర వాసులై ఉండాలి. వారు ఇంటర్ పాసై డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందడంతోపాటు పరిశ్రమ అవసరాలకు యువతను సిద్ధం చేయాలన్నదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమంటూ ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఆరు నెలల ఇంటర్న్షిప్ కాలంలో అర్హులైనవారికి నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఇంటర్ పాసైన వారికి నెలకు రూ. 6 వేలు, అదేవిధంగా డిప్లొమా/ఐటీఐ పూర్తి చేసినవారికి రూ. 8 వేలు, డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసినవారికి రూ. 10 వేల చొప్పున స్టైఫండ్ను ప్రభుత్వం చెల్లించనున్నది.
Also Read: ధోతీ ధరించాడని మాల్లోకి రానివ్వని సెక్యూరిటీ సిబ్బంది
ఈ సందర్భంగా పండరీపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. ఇప్పటికే మహిళల కోసం లాడ్లీ బెహన్ పథకాన్ని ప్రారంభించామని, పురుషుల కోసం పథకాలేవీ లేవా? అని చాలామంది అడుగుతున్నారన్నారు. అందుకే యువత కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామంటూ ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో అక్టోబర్ లేదా నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ ఒక కూటమిగా బరిలోకి దిగనున్నాయి.