Maha government passed resolution for seeking Bharat ratna to Ratan Tata : భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్త, భూరి విరాళాలు అందించే నిలువెత్తు మానవతావాది, భరతమాత ముద్దు బిడ్డ, దేశానికి విలువైన సేవలు అందించిన రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. అనంతరం దాని ప్రతులను కేంద్రానికి అందించింది.
సమాజ సంక్షేమాన్ని ఆశించే వ్యక్తిగా రతన్ టాటాను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తీర్మానంలో పేర్కొన్నారు. భారీ పరిశ్రమలను స్థాపించి దేశాభివృద్ధిని పరుగులు పెట్టించిన టాటా, దేశ భక్తిని చాటి చాటడంలోనూ ఆయనకు ఆయనే సాటి అని తీర్మానం ప్రశంసించింది. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేసిన పారిశ్రామికవేత్తగా ఆయనను అభివర్ణించింది.
సమాన ఆలోచనలు కలిగిన సామాజిక కార్యకర్త, దూరదృష్టి గల నాయకుడ్ని కోల్పోయామని మహారాష్ట్ర మంత్రి మండలి వివరించింది. పారిశ్రామిక రంగంతో పాటు సామాజిక అభివృద్ధిలోనూ టాటా కృషి అసాధారణమైందని పేర్కొంటూ ఆయన్ను స్మరించారు.
భారతమాత అక్కున చేర్చుకున్న మహారాష్ట బిడ్డ స్వీయ క్రమశిక్షణ, సమర్థమైన పరిపాలన, ఉన్నతమైన నైతిక విలువలతో ప్రజల మనిషిగా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడింది. కఠినమైన పరీక్షలను ఎదుర్కొని టాటా సంస్థలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని వేనోళ్ల కీర్తించింది.
రాష్ట్రపతి నుంచి ప్రధాని వరకు…
ప్రముఖ భారత వ్యాపారవేత్త రతన్ టాటా మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే రాష్ట్రపతి నుంచి గనర్నర్ల వరకు, ప్రధాని నుంచి కేంద్రమంత్రులు దాకా అంతా ఆయనను స్మరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు భారత ప్రజానీకం రతన్ టాటా సేవలను గుర్తు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. ఇంకోవైపు పలు రాష్ట్ర ప్రభత్వాలు గురువారం రోజును సంతాప దినంగా ప్రకటించేశాయి.
భారతరత్నతోనే అసలైన గౌరవం
ప్రపంచంలోనే మేటి వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా ఎదిగిన రతన్ టాటా, మానవతా వాదిగా భారతదేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన సేవలను గుర్తించిన మహా సర్కార్ భారతరత్న ప్రకటించాలని తీర్మానించింది.
ఆయన సేవలకు అసలైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. అంతకు ముందు ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేసిన మంత్రిమండలి, భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి అందించింది.
దేశంలోని మధ్య పేద తరగతుల ప్రజలపై రతన్ టాటాకు ఎనలేని ప్రేమ కురిపిస్తుంటారు. సంపన్న కుటుంబంలోనే ఆయన జన్మించినా, పేదల పట్ల ఆయనకు మమకారం ఉండేది.
దేశం అంటే మట్టికాదోయి
టాటా గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకి మునిమనవడిగా బిజినెస్ రంగంలోని అడుగుపెట్టిన రతన్ టాటా, గ్రూప్ చైర్మన్గా, తాత్కాలిక చైర్మన్గా సమర్థవంతంగా పనిచేశారు.
ఇదే సమయంలో టాటా గ్రూప్ ఛారిటబుల్ ట్రస్ట్ అధినేతగా దేశ ప్రజలకు కష్టాల్లో తోడుగా నిలిచారు. ఆయన పాటించిన విలువలు, సంస్థలను నడిపిన తీరు భావితరాలకు మార్గదర్శకంగా నిలిచాయి. ఆధునిక భారత దేశ పునర్నిర్మాణంలో టాటా గ్రూప్ కీలక పాత్ర పోషిస్తే, దాన్ని నడిపిన రతన్ టాటా కృషి దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.
Share